ఇజ్రాయెల్ ప్రధాని నఫ్తాలి బెన్నెట్ ఏప్రిల్ మొదటి వారంలో భారత్లో పర్యటించనున్నారు. ఇండో-ఇజ్రాయెల్ సంబంధాలు పరస్పర ప్రశంసలు, అర్థవంతమైన సహకారంపై ఆధారపడి ఉన్నాయని, రెండు దేశాల మధ్య దౌత్య సంబంధాల 30వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని ఈ పర్యటన ఉండబోతోందని ఇజ్రాయెల్ వర్గాలు తెలిపాయి.
ఆవిష్కరణలు, సాంకేతికత, భద్రత, సైబర్ టెక్నాలజీ, వ్యవసాయ రంగాల్లో ఇరు దేశాల మధ్య సహకారాన్ని విస్తరించడం కూడా ఈ పర్యటన లక్ష్యమని అన్నారు.
‘భారత ప్రధాని నరేంద్ర మోదీ ఆహ్వానం మేరకు నఫ్తాలీ బెన్నెట్ 2 ఏప్రిల్ 2022 న భారత్కు వస్తున్నారు’ అని ఇజ్రాయెల్ ప్రధాని మీడియా సలహాదారు ఒక ప్రకటనలో తెలిపారు.
గత అక్టోబర్లో గ్లాస్గోలో జరిగిన ఐక్యరాజ్యసమితి వాతావరణ మార్పు సదస్సు (COP26) సందర్భంగా ఇరువురు నేతలు తొలిసారిగా అక్కడే కలుసుకున్నారని, ప్రధాని మోదీ అధికారిక పర్యటనకు రావాల్సిందిగా ప్రధాని బెన్నెట్ను ఆహ్వానించారని ప్రకటనలో ఉంది.
ఏప్రిల్ 2 నుంచి ఏప్రిల్ 5 వరకు నాలుగు రోజులు పర్యటించనున్నారు బెన్నెట్. పర్యటనలో తన సీనియర్ ప్రభుత్వ అధికారులు, స్థానిక యూదు సమాజాన్ని కూడా కలవనున్నారు.
“నా మిత్రుడు, ప్రధాని మోదీ ఆహ్వానం మేరకు భారత్కు మొదటి సారిగా అధికారికంగా పర్యటించడం తనకు సంతోషకరమని.. మేమిద్దరం కలిసి దేశాల సంబంధాలకు మార్గనిర్దేశం చేస్తూనే ఉంటాం” అని బెన్నెట్ పత్రికా ప్రకటనలో పేర్కొన్నారు.
“భారత్, ఇజ్రాయెల్ మధ్య సంబంధాలను మోదీ పునఃప్రారంభించారు, ఇది చరిత్రాత్మక ప్రాముఖ్యత కలిగి ఉంది. భారతీయ సంస్కృతి, యూదు సంస్కృతి – లోతైనవి, మన రెండు ప్రత్యేక సంస్కృతుల మధ్య సంబంధాలు అర్ధవంతమైన సహకారాలపై ఆధారపడి ఉన్నాయి.. భారతీయుల నుంచి మనం నేర్చుకోగలిగేవి చాలా ఉన్నాయి” అని ఆయన అన్నారు.