ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మే 26న తెలంగాణ రానున్నారు. ఆరోజు ప్రత్యేక విమానంలో నేరుగా బేగంపేట విమానాశ్రయానికి చేరుకుంటారు. హైదరాబాద్లోని ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్(ISB) వార్షికోత్సవంలో పాల్గొంటారని బీజేపీ రాష్ట్ర శాఖ తెలిపింది. బీజేపీ పాలిత రాష్ట్రాల జాబితాలో తెలంగాణ కూడా చేరే అవకాశాలు మెండుగా ఉన్నాయనే అంచనాల నేపథ్యంలో ప్రధాని పర్యటన రాజకీయ ప్రాధాన్యతను సంతరించుకుంది. కాగా, మూడు వారాల వ్యవధిలో ముగ్గురు అగ్రనేతల రాష్ట్ర పర్యటనతో కాషాయదళంలో నూతన ఉత్సాహం నెలకొంది.
ప్రజా సంగ్రామ యాత్ర రెండవ దశను విజయవంతంగా పూర్తి చేసినందుకు మోదీ నుంచి ప్రశంసలు అందుకున్న రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ ప్రధాని పర్యటనను గ్రాండ్ సక్సెస్ చేయడంపై పార్టీ నేతలతో చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. ఈ క్రమంలోనే బేగంపేట ఎయిర్ పోర్టులో ప్రధానికి ఘన స్వాగతం పలికేలా ఏర్పాట్లు చేస్తున్నారు. జంట నగరాల్లో కనీవినీ ఎరగని రీతిలో ప్రధానికి స్వాగతం పలుకుతూ భారీ ఎత్తున ఫ్లెక్సీలను ఏర్పాటు చేయబోతున్నట్లు తెలిసింది.
బేగంపేటలో పార్టీ నేతలు మోదీ ని కలిసేలా రిసెప్షన్ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. మరోవైపు ఈనెల 26న రామగుండంలోని ఎరువుల ఫ్యాక్టరీ ప్రధానితో ప్రారంభింపజేసే కార్యక్రమానికి సన్నాహాలు జరిగాయి. అదే విధంగా హైదరాబాద్ నగర శివారులోని జినోంవ్యాలీలోని నిర్మాణం పూర్తయిన నేషనల్ యానిమల్ రిసోర్స్ ఫెసిలిటీ ఫర్ బయోమెడికల్ రీసెర్చ్ ను ప్రారంభించాలని పీఎంఓ కు ప్రతిపాదనలు వెళ్లాయని సమాచారం. అయితే ISB కార్యక్రమం తర్వాత మోదీ చెన్నైకి వెళ్తారని బీజేపీ వర్గాల సమాచారం.