మహా పతనం దిశగా బిజెపి అంటూ మీడియాలో చాలా రోజులుగా ఉన్న ఒక పెద్దాయన ఫేస్ బుక్ లో పోస్ట్ పెట్టారు. దానికి ఆయన చూపించిన కారణం బెంగాల్ లోకల్ బాడీ ఎన్నికల ఫలితాలు. గత సం. జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బిజెపి 70+ సీట్లు గెలుచుకుంటే బీజేపీ ఈ సారి ఒక్క మునిసిపాలిటీ కూడా కైవసం చేసుకోలేకపోయింది అంటే బిజెపి అంటే ప్రజలకు ఎంత ఏవగింపు కలిగిందో ఎంత వ్యతిరేకత ఏర్పడిందో అంటూ ఒక పోస్ట్ పెట్టారు.
ఎవరో సాధారణ ఫేస్ బుక్ వాడే వ్యక్తి పోస్ట్ అయితే నేను పట్టించుకోకపోదును. కానీ చాలా సం. లుగా మీడియాలో ఉన్న అటువంటి వ్యక్తి నుండి ఈ తరహా విశ్లేషణ రావడం నాకు కాస్త ఆశ్చర్యం అనిపించింది.
ఎందుకంటే కరడుగట్టిన బిజెపి అభిమానిని అయిన నాకే బెంగాల్ లోకల్ బాడీ ఎన్నికల్లో బీజేపీ మీద పెద్ద ఆశలు కాదు కనీస ఆశలు కూడా పెట్టుకోలేదు. అందుకే ఎవరో మిత్రుడు బెంగాల్ లోకల్ బాడీ ఎన్నికల్లో ఎవరు గెలుస్తారు అంటే 95% సీట్లు టీఎంసీ గెలుచుకుంటుంది అని జవాబు చెప్పాను. బెంగాల్ రాజకీయ పరిస్థితులను పరిశీలించిన మీదట అది నా అంచనా… మరి ఆ పెద్దాయన ఈ అంచనా ఎందుకు వేయలేకపోయారు? అంటే బిజెపి గెలుస్తుంది అని ఆయన ఊహించి భారీగా ఓడిపోయింది అని చంకలు గుద్దుకుంటూ ఆనందపడుతున్నారు అని ఆనుకోవచ్చా?
ఎందుకంటే గత అసెంబ్లీ ఎన్నికల్లో టీఎంసీ మీద విపరీత వ్యతిరేకత వల్ల బిజెపి కి పెద్ద ఎత్తున ప్రజలు మద్దత్తు ఇచ్చారు. 70+ సీట్లు ఇవ్వడమే కాదు 38% ఓట్లు ఇచ్చారు. మరి ఈ కొద్ది కాలంలో టీఎంసీ మీద వ్యతిరేకత పోయి ప్రేమ పుట్టుకు వచ్చిందా? మరి బిజెపి కి ఇప్పుడు మునిసిపాలిటీ ఎన్నికల్లో సీట్లు ఎందుకు రాలేదు అని నిజాయితీగా బెంగాల్ రాజకీయ కోణం నుండి విశ్లేషణ చేసి ఉంటే ఆయనకు తెలిసేది.
కానీ బిజెపి మీద వ్యతిరేకతో తమ మేధస్సును సరిగా వినియోగించకుండా తనకు కావలసినది విశ్లేషణ క్రింద రాసి పారేశారు.
బెంగాల్ లో సిపిఎం రాజకీయాలు మొదలుపెట్టిన దగ్గర నుండి ఆ రాష్ట్రంలో రాజకీయాల్లో హింస విపరీతంగా పెరిగిపోయింది. రాజకీయ ప్రత్యర్థులను, వారి అనుచరులను, వారికి మద్దత్తు ఇచ్చే ఓటర్లను హింసతో, బెదిరింపులతో పోలింగ్ బూత్ లకు దూరంగా ఉంచి 35 సం. లు పాలించారు. ప్రజల్లో సిపిఎం మీద తీవ్ర వ్యతిరేకత వున్నా భయం చేత సీపీఎం కి ఓట్ వెయ్యడం కానీ లేదా ఓటింగ్ కి గైర్ హాజరు అవ్వడం చేసేవారు. అటువంటి వారి ఓట్లు సిపిఎం కేడర్ వేసే వారు.
అలా పాలన సాగిస్తున్న కాలం లో ఆ హింసను తట్టుకుని ప్రతి హింస తో మమత బెంగాల్ రాజకీయాలను తమ గుప్పెట్లోకి తెచ్చుకున్నారు. అప్పటి దాకా సిపిఎం అంటే కోపం వున్నా భయంతో ఉన్న జనం టీఎంసీ కి ఓట్లు వెయ్యడం మొదలుపెట్టారు. కొంత సిపిఎం కేడర్ కూడా టీఎంసీ లో జాయిన్ అయి మమత హింసా రాజకీయాలకు మద్దత్తు ఇవ్వడమే కాక సిపిఎం కేడర్ ని భయపెట్టే హింసకు దిగారు. దాంతో సాధారణ ఓటర్లకు ధైర్యం వచ్చి మొదటి సారిగా పోలింగ్ బూత్ లకు వెళ్లి ఓట్లు వెయ్యడం తో సిపిఎం తుడిచిపెట్టుకొని పోయింది. గెలిచిన తరువాత కూడా మమత సిపిఎం కేడర్ ని నయానో భయనో తమ వైపు తిప్పుకుని సిపిఎం కి గ్రామాల్లో కూడా పట్టులేకుండా చేసి 35 సం. లు అప్రతిహతంగా పాలించిన సీపీఎం కి రాష్ట్రంలో ఉనికి లేకుండా చేసింది.
సిపిఎం వెళ్లిన అదే హింసా మార్గంలో మమత కూడా నడిచి 10 సం. లు పాలించింది. సాధారణ భారత ప్రజలు హింసకు ఎప్పుడూ వ్యతిరేకం. ప్రజలను భయపెట్టి ఎన్నాళ్లు పాలన సాగించగలరు? అవకాశం వస్తే అంటే ఆ హింసను తట్టుకుని ప్రజలకు ధైర్యం చెప్పే మరో రాజకీయ పార్టీ వస్తే కొంత మంది ప్రజలు ధైర్యం తెచ్చుకుని కొత్త పార్టీకి ఓటు వేస్తారు. అలా ఓటు ఓట్లు వేసి వెంటనే ఆ పార్టీ అధికారంలోకి రాలేదు. రెండు మూడు ప్రయత్నాలలో వస్తుంది. అంత వరకు తమ కేడర్ ను, తమకు ఓటు వేసిన వాళ్ళను ఆ పార్టీ ప్రతి హింస ద్వారా లేదా చట్టం ద్వారా కాపాడుకోగలగాలి. లేకపోతే అలా ఓటు వేసిన సాధారణ ఓటర్లను, ఆ పార్టీ కేడర్ ని అధికారంలో ఉన్న పార్టీ మరింత హింసకు భయభ్రాంతులకు గురిచేసి ఆ కొత్త పార్టీ కేడర్ ని, ఓటర్ల ను కొత్త పార్టీకి దూరం చేస్తుంది.
సరిగ్గా గత అసెంబ్లీ ఎన్నికల తరువాత జరిగింది అదే. టీఎంసీ మీద ప్రజల్లో విపరీతమైన వ్యతిరేకత ఏర్పడింది అనడానికి రుజువు మోడీని చివరి 3 పేజ్ లు ఎన్నికల ప్రచారానికి దూరంగా ఉంచినా బిజెపికి ఒక్క సారిగా అసెంబ్లీ ఎన్నికల్లో 38% ఓట్లు రావడం. బిజెపి అధికారంలోకి వస్తుంది తమకు భయం లేదు అని బీజేపీ పక్క ఉన్న కేడర్ మరియు బిజెపికి ఓట్లు వేసిన ప్రజలు అనుకున్నారు. కానీ దురదృష్టవశాత్తు బిజెపికి అధికారం రాకపోవడంతో మరియు స్వయంగా మమతే సువెందు చేతిలో ఒడిపోవడంతో మమత అహం దెబ్బతిని బిజెపికి మద్దత్తు ఇచ్చిన కేడర్ పైన సాధారణ ఓటర్ల పై దారుణమైన హింస చేసి అతి భయబ్రాంతులకు గురిచేశారు. గ్రామాల్లో అయితే స్త్రీలను పిల్లలను కూడా వదలలేదు. వందల మంది బిజెపి కార్యకర్తలు కుటుంబాలతో సహా అస్సాం పారిపోయారు. సిపిఎం మొదట్లో టీఎంసీ కేడర్ ని ఇలాగే టార్గెట్ చేసేవారు. కానీ మమత కూడా ప్రతిహింస తో తమ కేడర్ ని ఓటర్లను కాపాడుకోవడం మాత్రమే కాక ప్రతిహింస తో సిపిఎం కేడర్ లో కూడా భయం పుట్టించింది. అలా చాలా ఎన్నికలు అంటే పార్లమెంట్, అసెంబ్లీ, లోకల్ బాడీ ఎన్నికల్లో సిపిఎం హింసను ఎదుర్కొని నిలబడి కేడర్ ని ఓటర్ల ను కాపాడుకోవడం చేత మమత కేడర్ మరియు ఓటర్లు ఆ పార్టీ వెనుక ఉండటమే కాక అవకాశం దొరికిన వెంటనే అధికారం అప్పచెప్పారు. సిపిఎం హింస రాజకీయాల వల్ల సిపిఎం అంటే వ్యతిరేకత పెంచుకున్న అదే ఓట్లర్లు మరో ప్రత్యామ్నాయం లేక అదే తరహా హింసను అనుసరించిన టీఎంసీ ని అధికారం లోకి తెచ్చారు.
10 సం. ల టీఎంసీ హింసా పాలనతో విసుగెత్తిన ఓట్లర్లు మొదటి సరిగా 2019 లోక్ సభ ఎన్నికల్లో తమ వ్యతిరేకతను భారీగా తెలియచేసి బిజెపి కి ఊహించని అన్ని ఎంపీ సీట్లు ఇచ్చారు. అదే వ్యతిరేకతను ఎన్ కాష్ చేసుకుందాము అని అసెంబ్లీ ఎన్నికల్లో అన్ని శక్తులు ఒడ్డి బిజెపి పోరాడింది, చాలా మంది కొత్తవారు, కొంత టీఎంసీ,సిపిఎం, కాంగ్రెస్ కేడర్ కూడా బీజేపీ లో చేరారు. కానీ బిజెపి ఓడిపోయింది. బిజెపి గెలిచి అధికారంలోకి వస్తుంది అని ధైర్యం చేసి ప్రచారం చేసిన కేడర్ పై మమత పెద్ద ఎత్తున హింసకు పాలుపడటం, బిజెపి కి ఇటువంటి హింసా రాజకీయాలు కొత్త కాబట్టి తన కేడర్ ని ఓటర్లను ప్రతి హింస తో కాపాడుకోలేకపోయింది. అందుకే అసెంబ్లీ ఎన్నికల్లో అంత ధైర్యంగా ఉన్న కేడర్ ఆ తరువాత జరిగిన హింసకు బిజెపి ని వదిలెయ్యడం కానీ సైలెంట్ అయిపోవడం కానీ చేశారు. అందువల్లే లోకల్ బాడీ ఎన్నికల్లో భారీ ఓటమి.
బిజెపి దశాబ్దాలుగా రాజకీయాలలో ఉన్నా ఎప్పుడు గెలిచినా కానీ ఓడినా కానీ ప్రత్యర్థులపై కానీ వారి కేడర్ పై హింసకు దిగలేదు. కాంగ్రెస్ కూడా ప్రత్యర్ధులపై హింసకు దిగేది కాదు. రెండు జాతీయ పార్టీలు రాజకీయ హింసకు దూరంగా ఉన్నాయి. అందుకే బెంగాల్ లో కాంగ్రెస్ కనుమరుగు అయిపోయింది. బిజెపి రాజకీయ హింసకు దూరంగా ఉండటంతో అసెంబ్లి ఎన్నికల్లో హింసకు గురి అయిన కేడర్ నైతిక స్టైర్యం దెబ్బ తినడంతో బెంగాల్లో బిజెపి మళ్ళీ పుంజుకోవడం అంత సులభం కాదు.
బిజెపి మద్దత్తు దారులను ఎంత భయబ్రాంతులకు గురిచేశారు అంటే op india అనే వెబ్ పోర్టల్ ప్రధాన ఎడిటర్ నూపుర్ శర్మ అనే ఆమె కలకత్తా శాశ్వత నివాసి. మీడియాలో నూ బిజెపి సర్కిల్ లోనూ మంచి పలుకుబడి ఉంది. అయినా టీఎంసీ బెదిరింపులకు తట్టుకోలేక మొత్తం కుటుంబం కలకత్తా నుండి ఢిల్లీ మకాం మార్చేసుకుంది.
బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల అనంతరం జరిగిన హింస పై సుప్రీంకోర్టులో ఎన్ని పిల్స్ దాఖలు చేసినా పట్టించుకోలేదు. కానీ జాతీయ మానవ హక్కుల సంఘం మరియు కలకత్తా హై కోర్ట్ ఈ హింస పై తీవ్ర ఆక్షేపణ తెలియచేసాయి. బెంగాల్ లోకల్ బాడీ ఎన్నికలకు కేంద్ర బలగాలను పెట్టండి అని బీజేపీ చేసిన అభ్యర్ధనను కూడా సుప్రీంకోర్టు తిరస్కరించింది. కానీ అదే సుప్రీంకోర్టు త్రిపుర లోకల్ బాడీ ఎన్నికలకు కేంద్ర బలగాలను పెట్టమని టీఎంసీ కోరితే వెంటనే ఎన్నికల కమిషన్ కి ఆదేశాలు జారీ చేసింది..
ఇదే హింసా రాజకీయాలు నడిపి 35 సం. లు పాలించి విర్రవీగిన సిపిఎం పార్టీ పరిస్థితి నేడు చూస్తున్నాం. అదే పంథాలో వెళ్తున్న టీఎంసీ కి కూడా ప్రజల్లో సైలెంట్ వ్యతిరేకత వస్తే అటువంటి పరిస్థితి వస్తుంది. తప్పదు.
బిజెపి మీద ఈ పోస్ట్ పెట్టిన పెద్దాయన కేసీఆర్ మీద మమత మీద బోలెడు ఆశలు పెట్టుకున్నారు.. బిజెపి మీద ఈ వ్యతిరేక పోస్ట్ పెట్టడం కనీసం 5 అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వచ్చేవరకు అయినా ఆయన ఎదురు చూసి ఉంటే బాగుండేది.
Courtesy :- Chada Sasatry