సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ను అరెస్టు చేయటం ఖాయం అన్న మాట బలంగా వినిపిస్తోంది. అన్ని వ్యవస్థల మీద భయంకరమైన విమర్శలు చేయటం ఆయనకు అలవాటు. ఇప్పుడు అవే విమర్శలు ఆయనకు శాపంగా మారాయి. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మీద చేసిన విమర్శలకు సంబంధించి కేసులు ఆయన్ని వెంటాడుతున్నాయి.
ఒక రకంగా చెప్పాలంటే ఆయన వ్యక్తిగత దూషణలకు పాల్పడ్డారు. గత ఎన్నికలకు ముందు ‘వ్యూహం’ చిత్రాన్ని రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన సంగతి తెలిసిందే. ఆ సందర్భంగా చంద్రబాబు, పవన్ కల్యాణ్ లను కించపరిచేలా వర్మ సోషల్ మీడియాలో ఎన్నో పోస్టులు పెట్టారు. సినిమాలో సైతం వీరిని కించపరిచే పలు సన్నివేశాలు ఉన్నాయి. ఈ క్రమంలో వర్మపై ఉమ్మడి ప్రకాశం జిల్లా మద్దిపాడుకు చెందిన టీడీపీ నేత రామలింగం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆయన ఫిర్యాదు మేరకు వర్మపై పోలీసులు కేసు నమోదు చేశారు. తమ విచారణకు హాజరుకావాలంటూ హైదరాబాద్ లో ఉన్న వర్మకు ఏపీ పోలీసులు నోటీసులు ఇచ్చారు. నోటీసుల ప్రకారం పోలీసు విచారణకు వర్మ హాజరు కావాల్సి ఉంది. ఈ నేపథ్యంలో ఆయన ఏపీ హైకోర్టును ఆశ్రయించారు.
అక్కడ ఆయనకు నిరాశ ఎదురయింది. అరెస్ట్ నుంచి తనకు రక్షణ కల్పించాలని, తనపై నమోదైన కేసును కొట్టివేయాలని కోరుతూ హైకోర్టులో ఆయన వాదనలు వినిపించారు. ఆయన పిటిషన్ ను , వాదనలను హైకోర్టు విచారించింది. అరెస్ట్ నుంచి తాము రక్షించలేమని వర్మ న్యాయవాదికి కోర్టు స్పష్టం చేసింది. ఏదైనా ఉంటే బెయిల్ పిటిషన్ వేసుకోవాలని సూచించింది. అంతకన్నా ముఖ్యంగా పోలీసు విచారణకు హాజరు కావాలని ఆదేశించింది.
ఒంగోలులో ఉన్న ఆర్జీవీ దీని మీద స్పందించారు. సినిమా షూటింగ్స్ లో ఉన్నాను కాబట్టి, విచారణకు హాజరు కాలేనని, వారం రోజుల పాటు గడువు కావాలని వాట్సాప్ ద్వారా అభ్యర్థించారు. మొత్తం మీద సోషల్ మీడియాలో ఇప్పుడు ఆర్జీవీ అరెస్టు మీద బాగా ట్రెండ్ నడుస్తోంది.