ఆమె క్రైస్తవ మహిళ. కానీ ఎస్సీ మహిళకు రిజర్వ్ చేసిన పదవిలో కూర్చుంది. అంతే కాదు ఇద్దరి కన్నా ఎక్కువ మంది సంతానం ఉండరాదనే నిబంధనను అతిక్రమించి నలుగురు పిల్లలు ఉన్న ఆమె స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసింది. ఈ రెండు ఆరోపణలు నిరూపణ కావడంతో ఆమెకు పదవీగండం తప్పని పరిస్థితి ఏర్పడింది. ఆమె ఎవరో కాదు గుంటూరు జెడ్పీ చైర్ పర్సన్ హెన్రీ క్రిస్టినా.
ఏపీ సీఎం జగన్ కు అత్యంత సన్నిహితురాలైన క్రిస్టినా.. ఆయన అండలో కొల్లిపర నుంచి జెడ్పీటీసీ మెంబర్ గా పోటీ చేసి గెలిచారు. ఏకంగా జిల్లా పరిషత్ చైర్ పర్సన్ పీఠాన్నీ అధిష్టించారు. అయితే ఎస్సీ మహిళకు రిజర్వ్ అయిన ఆ పీఠంపై క్రిస్టియన్ ను ఎలా కూర్చోబెడతారని విపక్షాలు ప్రశ్నించాయి. ఆమె చేతిలో ఓడిపోయిన బీజేపీ అభ్యర్థి మండ్రు సరళ కుమారి జిల్లా కలెక్టర్ కు, ఎన్నికల కమిషన్ కు పలుమార్లు ఫిర్యాదు చేసినా ప్రభుత్వం, ఉన్నతాధికారులు పట్టించుకోలేదు. అంతే కాదు ఇద్దరికి మించి సంతానం ఉన్నవారు స్థానిక సంస్థల్లో పోటీకి అనర్హులు అనే నిబంధననూ ఆమె పాటించలేదు. నలుగురు పిల్లలున్న ఆమె పోటీకే అర్హురాలు కాదన్న సరళ కుమారి ఫిర్యాదును స్వీకరించిన కోర్టు ఈనెల 25న విచారణకు హాజరు కావాలని నోటీసులు జారీ చేసింది.
2014 అసెంబ్లీ ఎన్నికల్లో గుంటూరు జిల్లా తాడికొండ నుంచి పోటీ చేసిన క్రిస్టినా …ఆ సమయంలో సమర్పించిన ఎన్నికల అఫిడవిట్లో తన పిల్లల పేర్లు కనీసం ప్రస్తావించలేదు.
1950 నాటి రాష్ట్రపతి రాజ్యాంగ (షెడ్యూల్డ్ కులాలు) ఉత్తర్వులు ప్రకారం ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి హిందూమతాన్ని వీడి క్రైస్తవం లేదా ఇస్లాం స్వీకరించినట్లైతే ఆ వ్యక్తికి ఇకపై ఎస్సీ హోదా వర్తించదు. అయినా సరే క్రిస్టినా ఎస్సీగా చలామణి అవుతూ ఎస్సీ రిజర్వుడు స్థానం నుంచి పోటీ చేశారు.
ఇదే విషయంపై గతేడాది జూలై 15 న ఎస్సీ రిజర్వేషన్ పరిరక్షన సమితి గుంటూర్ జిల్లా జాయింట్ కలెక్టర్కు కాథెరా హెనీ క్రిస్టినా, కాథెరా సురేష్ కుమార్లపై ఫిర్యాదు చేశారు. క్రైస్తవ మతానికి చెందిన వీరు ఎస్సీ రిజర్వేషన్ ప్రయోజనాలకు పొందుతున్నారని వీరిపై చర్యలు తీసుకోవాలని సమితి కోరింది.
అటు క్రిస్టినా భర్త కత్తెర సురేష్ నడిపే హార్వెస్చ్ ఇండియా సొసైటీపైనా విమర్శలు వచ్చాయి. ఆ అంతర్జాతీయ క్రైస్తవ సంస్థకు అధ్యక్షుడిగా ఉన్న సురేశ్ ఏపీలో పెద్దఎత్తున క్రైస్తవ మతప్రచార కార్యకలాపాల్లో పాల్గొంటున్న విషయాన్నీ సరళకుమారి ఈసీ, కోర్టు దృష్టికీ తీసుకెళ్లారు.
సురేష్ కుమార్ అంతర్జాతీయ వేదికలపై భారత ప్రధాని నరేంద్రమోడీపై వ్యక్తిగత దూషణలకు పాల్పడినట్టుగా కూడా ఆధారాలు బయటపడ్డాయి. 2018లో అమెరికాలోని బయోలా విశ్వవిద్యాలయంలో జరిగిన మిషన్ కాన్ఫరెన్స్ లో సురేష్ కుమార్ మాట్లాడుతూ “ప్రస్తుతం మేము హిందూ పాలనలో ఉన్నాం, భారత ప్రధాని నరేంద్రమోడీ దేశంలో క్రైస్తవులు ఉండటాన్ని ఇష్టపడడు. భారతదేశాన్ని హిందూ దేశంగా చేయాలనుకుంటున్నారు. గత ఐదేళ్లలో ఎందరో పాస్టర్లను హత్య చేశారు. చర్చిలను కూల్చేస్తున్నారంటూ విద్వేషపూరిత ప్రసంగాలు చేసినట్టు ఆధారాల్ని కోర్టుకు సమర్పించారు సరళకుమారి.
ఆ దంపతులపై అనేక ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో లీగల్ రైట్స్ ప్రొటెక్షన్ ఫోరం హార్వెస్ట్ ఇండియా సంస్థకు ఉన్న విదేశీ విరాళాల నియంత్రణ చట్టం కింద విదేశీ నిధులకోసం పొందిన లైసెన్స్ రద్దు చేయాలని హోం శాఖను కోరింది.
(మైఇండ్ మీడియా ఫేస్బుక్, ట్విటర్, ఇన్స్టాగ్రామ్ను ఫాలో అవ్వండి. యూట్యూబ్ చానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.)