మెరుగైన రైల్వే సేవలు అందించేందుకు మోదీ సర్కారు ప్రతిష్టాత్మకంగా తీసుకువచ్చిన రైళ్లు వందేభారత్ ఎక్స్ ప్రెస్ లు. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 8 రూట్లలో ఆ సెమీ హైస్పీడ్ రైళ్లు పరుగులు తీస్తున్నాయి. ఇంకా కొన్ని వందేభారత్ రైల్లు రాబోతున్నాయి. ఇటీవలే విశాఖ-సికింద్రాబాద్ రైలు కూడా ప్రారంభమైంది. అయితే సకల హంగులతో ఉన్న ఆ రైళ్లను కూడా చెత్తకుప్పగా మారుస్తున్నారు ప్రయాణికులు. వందేభారత్ రైల్లో చెత్త పేరుకున్న ఫొటోస్ ను ఓ ఐఏఎస్ అధికారి షేర్ చేశారు. ఆ ఫొటోలు ఇప్పుడు సోషల్మీడియాలో వైరల్ అవుతున్నాయి. అవనీష్ శరణ్ అనే ఆ అధికారి ఆ ఫొటోను జతచేస్తూ‘వి ది పీపుల్’ అని క్యాప్షన్లో ఇచ్చారు. అందులో వాడిపడేసిన వాటర్ బాటిళ్లు, ఆహార పొట్లాలు, స్నాక్స్ కవర్లు, ఇంకా ఏవేవో ప్లాస్టిక్ వస్తువులు ఉన్నాయి. ఆ ట్వీట్ కు పలువురు నెటిజన్లు విచారం వ్యక్తం చేస్తూ స్పందనలు తెలుపుతున్నారు. భారతీయులకు హక్కులే తప్ప బాధ్యతలు అక్కర్లేదని.. వేల కోట్లు వెచ్చించి అధునాతన సౌకర్యాలతో కూడిన రైళ్లను కేంద్రం నడుపుతుంటే ఇంత బాధ్యతలేని తనమా అని మరికొందరు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.