ఏపీ శాసనమండలికి సంబంధించి మూడు పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలకు, రెండు ఉపాధ్యాయ స్థానాలకు, 4 స్థానిక సంస్థల కోటా స్థానాలకు సోమవారం జరిగిన పోలింగ్లో అనేక అవకతవకలు వెలుగుచూశాయి. ముఖ్యంగా గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలో అనర్హులు పెద్దెత్తున పాల్గొన్నారు. ఓటేసేందుకు వచ్చినవాళ్లను కొందరు మీడియా ప్రతినిధులు అడగ్గా
కొందరు సిక్స్త్ అని కొందరు సెవెన్త్ క్లాస్ అని చెప్పడం కనిపించింది. కొన్నిచోట్ల ఇంటర్ పిల్లలు వచ్చి ఓటేసినట్టు తెలిసింది. మహిళలు పెద్ద సంఖ్యలో ఓటేసేందుకు రావడం ఆశ్చర్య పరిచింది. మీడియా వాళ్లు అడగ్గా..కొందరు తమకు ఓటు స్లిప్పులు ఇచ్చి…ఓటు వేయమన్నారని అమాయకంగా చెప్పారు. అందుకు డబ్బులిచ్చారని మరికొందరు బయటపడ్డారు. అందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో అవుతున్నాయి.
ఇక ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఈ అవకతవకలపై
ప్రతిపక్ష నేతచంద్రబాబు సహా బిజెపి, జనసేన, కాంగ్రెస్ పార్టీల నాయకులు ఈసీకి ఫిర్యాదు చేశారు.
సోమవారం శ్రీకాకుళం- విజయనగరం- విశాఖపట్నం, అలాగే ప్రకాశం-నెల్లూరు- చిత్తూర, కడప- అనంతపురం- కర్నూలు పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలు మూడింటికి పోలింగ్ జరిగింది. ప్రకాశం- నెల్లూరు- చిత్తూరు, అలాగే కడప-అనంతపురం- కర్నూలు, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానాలు రెండింటికి, పశ్చిమగోదావరిలో రెండు, శ్రీకాకుళం, కర్నూల్లో ఒక్కొక్కటి చొప్పున స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానాలకు కూడా పోలింగ్ జరిగింది. ఇప్పటికే స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానాలు అనంతపురం, కడప, నెల్లూరు, తూర్పుగోదావరి, చిత్తూరు జిల్లాలలో ఐదు స్థానాలు ఏకగ్రీవమయ్యాయి.అటు తెలంగాణలో ఉమ్మడి మహబూబ్ నగర్- రంగారెడ్డి-హైదరాబాద్ జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానానికి పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. 90. 40% పోలింగ్ నమోదయింది. ఈనెల 16న కౌంటింగ్ జరగనుంది.