ప్రధానమంత్రి నరేంద్రమోదీ స్వయంగా యోగాసనాలు వేయటంతో విశాఖ పట్నంలో నిర్వహించిన యోాగాంధ్ర కార్యక్రమం సూపర్ డూపర్ సక్సెస్ అయింది. 2014 లో అధికారాన్ని చేపట్టాక ప్రధానమంత్రి నరేంద్రమోదీ .. జూన్ నెల 21న అంతర్జాతీయ యోగా దినోత్సవంగా మలిచారు. ఈ స్ఫూర్తిని అందిపుచ్చుకొంటూ వివిధ దేశాలలో యోగా డే కార్యక్రమాలు రూపుదిద్దుకొన్నాయి. ప్రతీ సంవత్సరం భారతదేశంలోని వివిధ నగరాలు, పట్టణాల్లో యోగా డే ని నిర్వహిస్తున్నారు. ప్రతీ ఏటా దేశంలోని ఒక నగరంలో నరేంద్రమోదీ స్వయంగా ఈ కార్యక్రమంలో పాల్గొనటం ఆనవాయితీ.
ఈ సంవత్సరం విశాఖపట్నంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అధికారికంగా యోగాంధ్ర కార్యక్రమాన్ని తలపెట్టింది. ఈ బ్రహత్తర కార్యక్రమంలో ప్రధానమంత్రి మోదీ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా విశాఖ బీచ్ ప్రాంతంలో వీధులన్నీ కిక్కిరిసి పోయాయి. సుమారు 3 లక్షలకు పైగా ప్రజలు స్వచ్ఛందంగా తరలివచ్చి యోగాసనాలు వేసి, ఉత్సాహంగా పాలు పంచుకొన్నారు. ఇన్ని లక్షలమంది యోగాలో పాల్గొనటం ద్వారా గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు సృష్టించినట్లు అయింది. అలాగే అల్లూరి సీతారామరాజు జిల్లాకు చెందిన 25వేలకు పైగా గిరిజన విద్యార్థులు క్రమం తప్పకుండా 108 నిముషాల పాటు సూర్య నమస్కారాలు చేశారు. ఏడాది పాటు క్రమం తప్పకుండా అటవీ పుత్రులు యోగాను అభ్యసించారు. ఈ విద్యార్థుల కృషికి గాను మరో గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు లభించింది.
యోగాంధ్ర కార్యక్రమం ప్రారంభంలోనే ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…. యోగాకి హద్దుల్లేవని, అందరిదని అన్నారు. నేపథ్యం, వయస్సు, సామర్థ్యానికి అతీతమైంది యోగా అని వివరించారు. యోగా అనేది ప్రపంచాన్ని ఏకతాటిపైకి తెచ్చిందన్నారు. యోగా అనేది యావత్ మానవాళి మళ్లీ ఊపిరి పీల్చుకోవడానికి అవసరమైన విరామ బటన్ అని అభివర్ణించారు. యోగా ప్రపంచాన్ని ఏకం చేసిందని, 175 దేశాలు యోగాను అనుసరిస్తున్నాయన్నారు. యోగా విశ్వవ్యాప్తం కావడం సామాన్యమైన విషయం కాదన్నారు. యోగా ప్రపంచ వ్యాప్తంగా ప్రజల జీవన శైలిని మార్చిందని, అంతరిక్షంలో కూడా యోగా చేసిన ఘనత మనదేనని ప్రకటించారు.
యోగా గొప్పతనాన్ని ప్రధానమంత్రి మోదీ ఈ సందర్బంగా వివరించారు. ఆధునిక పరిశోధనల ద్వారా భారత్ యోగా శాస్త్రానికి సాధికారతనిస్తోందని, యోగా థెరపీని కూడా క్షేత్ర స్థాయిలో ప్రోత్సహిస్తున్నామని తెలిపారు.ఢిల్లీలోని ఏయిమ్స్ ఈ విషయంలో బాగా పని చేసిందని ప్రశంసించారు. గుండె, నాడీ సంబంధిత రుగ్మతల విషయంలో యోగా కీలక పాత్ర పోషిస్తుందన్నారు. అలాగే మహిళల ఆరోగ్యం, మానసిక సంతులనంలోనూ యోగాది కీలక పాత్ర అని అన్నారు. యోగా మనల్ని నడిపిస్తోందని, మనల్ని మేల్కొలుపుతుందని అన్నారు. ‘‘వన్ ఎర్త్.. వన్ హెల్త్’’ థీమ్ తో ఈ సారి యోగా దినోత్సవాన్ని నిర్వహించామని, యోగాను మరింత ప్రజల్లోకి తీసుకెళ్లడానికి ఇకో సిస్టంను డెవలప్ చేస్తున్నామని ప్రకటించారు. నేను నుంచి మనం అన్న భావన భారత దేశ ఆత్మ అని, ఎప్పుడైతే వ్యక్తి వ్యక్తిగతం నుంచి బయటకొచ్చి, సమాజం గురించి ఆలోచిస్తాడో.. అప్పుడే మానవత్వం పరిమళిస్తుందన్నారు. సర్వే భవంతు సుఖిన: అన్న భావనను భారతీయత బోధిస్తుందని, ఇదే సామాజిక సమరసతను కూడా ప్రోత్సహిస్తుందని మోదీ వివరించారు.
యోగాంధ్ర కార్యక్రమం విశాఖపట్నం ఆర్ కే బీచ్ దగ్గర కన్నుల పండువగా సాగింది. ఏపీ గవర్నర్ నజీబ్, ముఖ్యమంత్రిచంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, సీనియర్ మంత్రులు ఇందులో పాలు పంచుకొన్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ వివిధ పట్టణాలు, నగరాల్లో యోగా డే కార్యక్రమాన్ని నిర్వహించారు.