యోగా అనేది భారతదేశంలో ఉద్భవించిన సనాతనమైన అభ్యాసం.
వెలకట్టలేని అత్యద్భుతమైన ఈ’ యోగ’ అభ్యాసం ఆదియోగి అయినటువంటి మహాశివుడు పతంజలి మహర్షిని నిమిత్తంగా చేసుకొని మానవవాళికి అందించిన మహోన్నతమైన వరం. భౌతికంగా, మానసికంగా ధృఢంగా చేసే ప్రక్రియ యోగా. యోగా వలన ఎన్నెన్నో లాభాలు భౌతికంగా మానసికంగా, ఆధ్యాత్మికంగా ఉన్నాయి.
నేటి కాలంలో హడావిడి జీవితంలో మనస్సుని, ఆత్మని,బుద్ధిని స్థిరం చేసే ఏకైక ఆయుధం యోగా.
ఆత్మని అనగా జీవాత్మను పరమాత్మ తో జోడించబడే మార్గ నిర్దేశకం ఈ యోగా.
మానసిక వికాసానికి అయిన బుద్ధి వికాసానికి అయిన తనను తాను పరిశీలించుకుంటు, పరీక్షించుకుంటు, బలాలను, బలహీనతలను తెలుసుకుంటు సరిచేసుకుంటు, ఉన్నత దిశవైపుకి కొనసాగించడినికి తోడ్పడుతుంది.
దృష్టికోణాన్ని మారుస్తుంది.
ఆలోచన విధానాన్ని ఉన్నతంగా చేస్తుంది , ఇడ నాడి పింగళ నాడులను జాగృత పరిచి సుషుమ్న నాడిలో కలిసేలా చేస్తుంది .
ఇంత అత్యద్భుతమైన అభ్యాసాన్ని భారతదేశంలోనే కాకుండా నేడు ప్రపంచ వ్యాప్తంగా సాధన చేస్తున్నారు.
యోగాని విశ్వంలో ప్రతి ఒక్కరికి అందచేయాలని ఎందరో కృషి చేశారు.
వారిలో పరమహంస యోగానంద, స్వామి వివేకానంద, రామకృష్ణ పరమహంస, బి కే ఎస్ అయ్యంగారు, పండిట్ రవిశంకర్, సద్గురు జగ్గి వాసుదేవ్, రామ్ దేవ్ బాబా. ఇలా ఎందరో కృషి చేశారు. ప్రపంచ శాంతి కొరకు యోగాకి ఎంతో గొప్ప స్థానం ఉంది.
దీని మూలంగా ఫాదర్స్ డే, మదర్స్ డే జరుపుకునే విధంగానే యోగా దినోత్సవాన్ని కుడా జరుపుకోవాలని భారతదేశప్రధాని నరేంద్ర మోది సూచించారు.
ప్రధాని నరేంద్ర మోడీ సెప్టెంబర్ 2014 లో తన UN ప్రసంగంలో జూన్ 21 న వార్షిక యోగా దినోత్సవాన్ని సూచించారు.
జూన్ 21 అనేది వేసవి కాలం ఉత్తరార్థ గోళంలో సంవత్సరంలో అత్యంత పొడవైన రోజు మరియు ప్రపంచంలోనే అనేక ప్రాంతాల్లో ప్రత్యేక ప్రాముఖ్యతను కలిగి ఉంది.
యోగాసనాలలో సూర్య నమస్కారం ప్రత్యేకమైనది.
సూర్య నమస్కారము అనగా సూర్య భగవానుడికి శారీరకంగా చేసే నమస్కారం దీనివలన జీవితకాల రుగ్మతలను నయం చేసే ఒక అత్యద్భుతమైన ఔషధం సూర్యనమస్కారం.
యోగాసనాలు చేయడం నేడు దినచర్యలో భాగం అయింది. ప్రాణాయామం శ్వాసను క్రమబద్ధీకరణ చేస్తూ నియంత్రణలో ఉంచుతుంది.
ధ్యానం వల్ల ఏకాగ్రత,స్థిరత్వం లభిస్తుంది.
యోగా భారతదేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధిగాంచింది.
– మునిగెల యోగిత శ్రీధర్