అమ్మ కు ఎంతటి ప్రాధాన్యం ఉంటుందో అమ్మ భాషకు కూడా అంతే ప్రాధాన్యం ఉంటుంది. అమ్మ భాష తోనే ఆప్యాయత, అనుబంధం ఏర్పాడతాయి అనటంలో అనుమానమే లేదు. అందుచేతనే ప్రతీ సంవత్సరం ఫిబ్రవరి 21వ తేదీన అమ్మ భాష దినోత్సవం పాటిస్తున్నారు.
నిజానికి దినోత్సవం రోజునే దీనిని గుర్తు చేసుకొని, మిగిలిన రోజులు వదిలేయాలన్నది కాదు. కానీ ఈ సందర్భాన అమ్మ భాష గొప్పతనాన్ని మరొక్కసారి గుర్తు చేసుకోవటమే. వాస్తవానికి.. అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవాన్ని ప్రతి ఏడాది ఫిబ్రవరి 21వ తేదీన నిర్వహించాలని 1999వ సంవత్సరం నవంబరు 19న జరిగిన యునెస్కో 30వ సాధారణ మహాసభ చర్చించి ప్రకటించింది. ఎందుకంటే, తూర్పు పాకిస్తాన్, బంగ్లాదేశ్లో యూనివర్సిటీ విద్యార్థులు తమ మాతృభాష అయిన బెంగాలీలో పాఠ్యాంశాలు బోధించాలని ఉద్యమించారు. ఫలితంగా హింస చెలరేగి పలువురు విద్యార్థులు ప్రాణత్యాగం చేశారు. మాతృభాష కోసం చేసిన త్యాగం ఫలితంగా 1999 ఫిబ్రవరి 21 నుంచి ప్రపంచ మాతృభాషా దినోత్సవంగా నిర్వహించడానికి నిర్ణయించారు.ఆ మరుసటి ఏడాది అంటే 2000 సంవత్సరం నుంచి ప్రతి ఏటా మాతృభాషా పరిరక్షణ కార్యక్రమాన్ని యునెస్కో డైరెక్టర్ జనరల్ ప్రకటిస్తూ వస్తున్నారు.
అమ్మ భాష గొప్పతనాన్ని ఈ సందర్భంగా ప్రపంచం అంతా గుర్తించింది అనుకోవచ్చు. ప్రపంచంలో చిన్న, పెద్ద భాషలన్నిటినీ రక్షించుకోవాలని, భాషా సాంస్కృతిక వైవిధ్యాన్ని కాపాడుకోవడం ద్వారానే మనం జీవవైవిధ్యాన్ని, సంప్రదాయాన్ని కాపాడుకోగలం. బహుభాషల విధానాన్ని ప్రోత్సహించాలని, అది విశాల దృష్టిని, శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందిస్తుందని అర్థం చేసుకోవాలి. అయితే మాతృభాషను కాపాడుకుంటూనే దాని ద్వారానే తక్కిన భాషల్ని నేర్చుకోవడం, అనంత విజ్ఞానాన్ని పొందడం సరైన మార్గం అన్నది వాస్తవం.
ఇక భారతదేశం విషయానికి వస్తే, ప్రపంచంలో మొత్తం ఆరు వేల భాషలు ఉండగా, భారతదేశంలో 1,652 మాతృభాషలు ఉన్నాయి. వీటిలో 16 భాషలకు మాత్రమే లిపి ఉంది. మరో 200 భాషలకు 1600 పైగా మాండలికాలున్నాయి. కనీసం 30 శాతం మంది పిల్లలు మాతృభాషను నేర్చుకోవడం మానేస్తే మాతృభాష ఉనికికి ముప్పు వాటిల్లుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
మన దేశంలో 57 అక్షరాలు, 3 ఉభయ అక్షరాలు ఉన్న మన తెలుగు భాష.. ప్రపంచ భాషల్లోనే రెండో అతి పెద్ద మాతృభాషగా మన్ననలు పొందుతుంది. హిందీ తరువాత తెలుగు మాట్లాడే వారు ఎక్కువగా ఉన్నారు. బోధించే భాషలన్నింటిలో మాతృభాషకు ప్రధాన స్థానం ఉండాలనేది మాతృభాష అనేది బోధనా మాధ్యమంగా ఉండాలనేది విద్యావేత్తల అభిప్రాయం. మనుగడ కోసం ఇతర భాషలను నేర్చుకోవడంలో తప్పులేదు. అయితే వాటి ప్రభావం మాతృభాషపై పడకుండా చూసుకోవాలి.
తెలుగు భాష గొప్పతనాన్ని మనం అంతా అర్థం చేసుకోవాలి. అందుచేత కనీసం ఇళ్ల దగ్గర అయినా పూర్తి స్థాయిలో తెలుగు ను అనుసరించటం ఉత్తమం.