దేవరయాంజల్లోని దేవాదాయ భూముల్నీ మాజీ మంత్రి ఈటల రాజేందర్ కబ్జా చేశారన్న ఆరోపణలపై రాష్ట్ర ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. అందులోభాగంగా… మేడ్చల్ జిల్లా దేవరయాంజల్లోని శ్రీ సీతారామచంద్రస్వామి దేవాలయ భూములను జిల్లా కలెక్టర్ శ్వేతామహంతి పరిశీలించారు. ఆలయ భూముల ఆక్రమణల ఆరోపణలపై ఎంక్వైరీకి ప్రభుత్వం కమిటీ వేసింది.ఏసీబీ, విజిలెన్స్ దర్యాప్తునకూ ఆదేశించారు కేసీఆర్. దీంతో ఈటల ఆధీనంలో ఉన్న భూముల్లోని గోదాంలనూ జిల్లా కలెక్టర్, రెవెన్యూ, విజిలెన్స్ అధికారులు పరిశీలించారు.సీతారామ చంద్రస్వామి ఆలయానికి సంబంధించి 1,521 ఎకరాల 13 గుంటల భూమి ఉండేదని…పెద్దఎత్తున ఆక్రమణలు, భూ బదలాయింపులు జరిగాయని ఫిర్యాదులు వచ్చినట్టు సర్కారు ఉత్తర్వుల్లో పేర్కొంది. అంతకుముందు మెదక్ జిల్లా మాసాయిపేట మండలం అచ్చంపేట, హకీంపేట గ్రామాల్లో అసైన్డ్ భూముల్ని ఈటల ఆక్రమించినట్టు వచ్చిన ఫిర్యాదులపై సీఎం కేసీఆర్ విచారణకు జరిపించడం, ఆక్రమణ వాస్తవమని తేలడంతో ఆయన్ని మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేసిన సంగతి తెలిసిందే.