ఈ రోజు సికింద్రాబాద్ డివిజన్ లో సనత్ నగర్ -శంకరపల్లి రైల్ సెక్షన్ లో ఒక విచిత్రం జరగబోతోంది. అది ఏమిటంటే ఫుల్ స్పీడ్ లో ఎదురు ఎదురుగా వెళ్తున్న రెండు ట్రైన్స్ గుద్దుకోడానికి ప్రయత్నిస్తాయి. ఒక దాని ఇంజిన్ లో సాక్షాత్తు కేంద్ర రైల్వే మంత్రి ఉండగా రెండో దానిలో రైల్వే బోర్డ్ చైర్మన్ వుంటారు..

Central Railway Minister Ashwini Vaishnaw
దేని కోసం ఈ ప్రయోగం అంటే భారత దేశం స్వయంగా చవగ్గా తయారు చేసిన “కవచ్” అనే “రైళ్లు ఢీ కొట్టకుండా ఆపే ఆటోమేటిక్ రక్షణ వ్యవస్థని” పరిశీలించడం కోసం. ఈ వ్యవస్థ ప్రపంచంలోనే చవకైన ఈ తరహా రక్షణ వ్యవస్థగా రైల్వే శాఖ చెపుతోంది.
ఎదురెదురుగా రైళ్లు వస్తున్నాయి అని ఈ ఆటోమేటిక్ వ్యవస్థ ముందుగానే పసికట్టి ఆ రెండు రైళ్లకు ఆటోమాటిక్ గా బ్రేక్స్ వేసి దూరం ఉండగానే ఆపుతుంది. అలాగే పొరపాటున రెడ్ సిగ్నల్ జంప్ అవ్వడం, రైల్వే గేట్స్ పొజిషన్, ఏదైనా మెకానికల్ లోపాలు తలయెత్తినా ఈ డిజిటల్ సిస్టమ్ వెంటనే పసిగట్టి రైలు ఆపుతుంది. అలాగే ఒక ట్రాక్ మీద ప్రమాద పరిస్థితి ని పక్క ట్రాక్స్ మీద వచ్చే ట్రైన్స్ కూడా సమాచారం ఇచ్చి ఆపుతుంది
ఈ రోజు ప్రయోగంలో ఎదురెదురుగా నే కాకుండా వెనుకనుంచి వచ్చే రైళ్లను కూడా ఈ సిస్టం ఎలా గుర్తించి ట్రైన్స్ ని ఆపగలదో పరీక్షిస్తారు..
అధిక ఫ్రీక్వెన్సీ రేడియో కమ్యూనికేషన్ సిగ్నల్ సాంకేతిక ఆధారంగా ఈ సిస్టం పనిచేస్తుంది.
RFID టాగ్ లు ట్రాక్స్ వద్ద, సిగ్నల్స్ వద్ద ఉండి స్టేషన్ మాస్టర్ కి, డ్రైవర్స్ కి, రూట్ రిలే క్యాబిన్ సిబ్బందికి తమ కన్సోల్ లో అప్పుడు ఉన్న సిగ్నల్ పొజిషన్ కనిపిస్తుంది. ప్రస్తుతం డ్రైవర్స్ ఇంజిన్ కిటికీలోంచి తల బయటపెట్టి సిగ్నల్ స్టేటస్, ట్రాక్ పొజిషన్ తెలుసుకుంటున్నారు. కానీ పొగమంచు లేదా ఇతర వాతావరణ కారణాలు వల్ల సిగ్నల్ స్టేటస్ గానీ ట్రాక్ పై ముందు ఏదైనా ట్రైన్ వస్తున్న సంగతి గానీ డ్రైవర్ కావలసినంత ముందుగా గుర్తించలేక ప్రమాదాలు జరుగుతున్నాయి. ఈ డిజిటల్ సిస్టం అటువంటి ప్రమాదాల నుండి రక్షణ కల్పిస్తుంది.
ప్రపంచ వ్యాప్తంగా ఈ తరహా వ్యవస్థ అమలు చేయడానికి కి.మీ కి ₹2కోట్లు అవుతూ ఉంటే భారత్ తయారు చేసినది కేవలం ₹50లక్షలకే వస్తోంది. ఇది “ఆత్మ నిర్భర్” లో భాగంగా తయారుచేశారు. ముందుగా 2016లో కొన్ని పాసెంజర్ రైళ్లలో ప్రయోగాత్మకంగా ఉపయోగించి చూసి, ఆ పై మెరుగులు దిద్దారు. చివరిగా థర్డ్ పార్టీ చేత కూడా పరీక్షించిన తరువాత ముందుగా 110kmph అనుకున్నది 160kmph వరకు ఆమోదించబడింది.
ఇప్పటి వరకు ఈ కవచ్ సిస్టం సౌత్ సెంట్రల్ రైల్వే లో 1098 రూట్ కి.మీ.లోనూ 65 ఇంజన్స్ లోనూ అమర్చారు. ఇది ఈ SCR పరిధిలో 3000 కి.మీ అమలు పరచడానికి టెండర్లు పిలుస్తున్నారు. అలాగే ఎక్కువ రద్దీ గల ఢిల్లీ-ముంబై, ఢిల్లీ-హౌరా మార్గాలను ప్రాధాన్యతా క్రమంలో తరువాత చేపడతారు.
గతంతో పోలిస్తే మామూలుగానే మోడీ ప్రభుత్వం వచ్చాక రైలు ప్రమాదాలు చాలా వరకు తగ్గాయి. ఈ వ్యవస్థ కూడా అమలు లోకి వస్తే రైల్వే శాఖ అనుకునే జీరో ప్రమాదాల స్థితి చేరుకునే అవకాశం ఉంటుంది.
….చాడా శాస్త్రి….