ఈ కాలం యువత పుట్టినరోజు పేరుతో చేసే హడావిడి అంతా ఇంతా కాదు. అర్ధరాత్రి రోడ్లమీద కేకులు కట్ చేయడం, బైక్ ల మీద విపరీతమైన స్పీడ్ తో చక్కర్లు కొట్టడం, మందు పార్టీల పేరుతో చెలరేగిపోవడం సర్వసాధారణంగా మారింది. ఒకరిని చూసి ఒకరు విచ్చలవిడిగా ఖర్చు పెట్టేందుకు పోటీ పడుతున్నారు.
ఇటువంటి పరిస్థితులలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా బోథ్ ప్రాంతానికి చెందిన పడిగెల నాగరాజు వినూత్నంగా ఆలోచించారు. పుట్టినరోజు మరో 10 మందికి ఉపయోగపడాలని తలపోశారు. స్థానిక గిరిజన గూడెంలలో విద్యార్థులకు కనీస వసతులు లేవని తెలుసుకొని అడుగు ముందుకు వేశారు. పుట్టినరోజు సందర్భంగా నవనిర్మాణ సొసైటీ సభ్యుడు అయిన పడిగెల నాగరాజు స్థానిక గిరిజన పిల్లలకు భోజనం పళ్ళాలు అందజేశారు. మహదుగూడ, నాగు గూడ, పార్డి బీ, టీవిటీ గ్రామాలకు చెందిన ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం అమలు అవుతోంది. ఆ సౌకర్యం వినియోగించుకొనే నిరుపేద విద్యార్థులకు పరిశుభ్రమైన కొత్త భోజనం పళ్ళాలను నాగరాజు సమకూర్చారు. విద్యార్థులకు స్నాక్స్ పంచి పుట్టినరోజు వేడుక జరుపుకొన్నారు. ఈ కార్యక్రమంలో నవనిర్మాణ సొసైటీ అధ్యక్షులు శుద్ధోధన్, మునిగెల శ్రీధర్, ఆకాష్, రాహుల్, సిద్ధు, వంశీ తదితరులు పాల్గొన్నారు.