కర్నాటలో దారుణం జరిగింది. చిక్కమంగళూర్ జిల్లా జెనుగడ్డెలో కాఫీతోటలో పనిచేస్తున్న కూలీలపై అమానుషంగా ప్రవర్తించారు. యజమాని వారిని రోజంతా నిర్బంధంలో ఉంచి చిత్రహింసలకు గురిచేశారు. అందులో ఉన్న గర్బిణీపై దాడి చేయడంతో ఆమెకు అబార్షన్ అయింది. వారంతా రోజువారీ కూలీలని తెలిసింది.బాధితుల ఫిర్యాదులో పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే ఇంతటి అమానుషానికి పాల్పడిన జగదీశ్ గౌడ, ఆయన కుమారుడు లతిక్ గౌడలు బీజేపీ నాయకులని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నారు. అయితే విపక్ష ఆరోపణల్ని అధికార బీజేపీ ఖండించింది. జగదీశ్ గౌడ పార్టీ అధికార ప్రతినిధి అంటూ జరుగుతున్న ప్రచారాన్ని తోసిపుచ్చింది. అసలు అతనికి పార్టీ సభ్యత్వమే లేదని..కేవలం మద్దతుదారు, ఓటరు మాత్రమేనని స్పష్టం చేసింది.
ఆ కూలీలంతా జగదీష్ నుంచి 9 లక్షల వరకు అప్పుగా తీసుకున్నట్టు తెలిసింది. వాళ్లు డబ్బులు తిరిగి ఇవ్వకపోవడంతో నిర్బంధించినట్టు చెబుతున్నారు. తమ వాళ్లను జగదీష్ గౌడ చిత్రహింసలకు గురిచేస్తున్నారంటూ బాధితుల బంధువులు అక్టోబర్ 8న బలెహొన్నూరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. అయితే తరువాత కేసు ఉపసంహరించుకున్నారు కూడా. కానీ మరుసటి రోజు అందులోని ఓ మహిళకు రక్తస్రావం జరిగింది. అప్పుడు మరోసారి ఫిర్యాదు చేశారు. ఎస్పీ ఆదేశాలతో ఎఫ్ఐఆర్ నమోదు చేశారు పోలీసులు.