కాంగ్రెస్ పదే పదే నినాదాలు చేయడం తప్ప పేద ప్రజలకు పెద్దగా ఏం చేయలేకపోయిందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. తన పార్లమెంటరీ నియోజకవర్గం గాంధీనగర్లో జరిగిన పలు కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నారు. ఇందిరాబెన్ (ఇందిరా గాంధీ) ‘గరీబీ హఠావో’ అని అనీఅనీ విసిగిపోయింది, కానీ దాని వల్ల ఎటువంటి మార్పు రాలేదు. పేదరికాన్ని తొలగించడానికి నినాదాలు చేశారు, కానీ ఫలితం లేదు. ఎందుకంటే కాంగ్రెస్ హయాంలో ప్రభుత్వ పథకాలు ఏళ్ల తరబడి కాగితాలకే పరిమితమయ్యాయి”అని షా అన్నారు.
అయితే గత ఎనిమిదేళ్లలో పేదల జీవితాల్లో మార్పు తీసుకురావడానికి ప్రధాని నరేంద్ర మోదీ అనేక పథకాలను అమలు చేశారని, అంతేకాకుండా పార్టీ సంస్థగా.. బీజేపీ ఈ పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లిందని అన్నారు. గుజరాత్ అభివృద్ధి నమూనాను ప్రస్తావిస్తూ, అప్పటి ముఖ్యమంత్రిగా ప్రధాని మోదీ చేసిన కృషి రాష్ట్ర అభివృద్ధిలో కీలక పాత్ర పోషించిన నీటి సమృద్ధిని నిర్ధారించిందని షా అన్నారు. మోదీజీ వల్లే ఎల్పీజీ సిలిండర్లు, టాయిలెట్లు, బ్యాంకు ఖాతాలు, విద్యుత్ తదితర సౌకర్యాలు ప్రజలకు ఇంటి వద్దకే అందుబాటులోకి వచ్చాయని అన్నారు. 5 లక్షల వరకు ఆరోగ్య సేవల కోసం 60 కోట్ల మందికి ‘ఆయుష్మాన్ భారత్’ కార్డులను ఉచితంగా అందించామని ఆయన సూచించారు.
“ప్రభుత్వం ప్రాజెక్టులు నిర్మిస్తే, వాటి గురించి ప్రజలకు తెలియకపోతే.. అవి కాగితంపైనే మిగిలిపోతాయి. కాంగ్రెస్ హయాంలోనే ఇదే చూశాం” అని అన్నారు.