భారతీయ ఇంటర్నెట్ ను ప్రమాదంబారిన పడకుండా కాపాడ్డానికి అలాగే బిక్ టెక్ వ్యాపారుల చేతుల్లో ఆయుధంగా మారకుండా చూసేందుకు స్థానిక చట్టాలపై పునరాలోచించాల్సిన అవసరం ఉందని ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సహాయమంత్రి రాజీవ్ చంద్రశేఖర్ అన్నారు. రష్యా-యుక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో బిగ్ టెక్ కంపెనీలు.. వాటి అనుబంధ సంస్థలు పాక్షిక లేదా పూర్తి సేవా అంతరాయాలను ప్రకటించిన నేపథ్యంలో ఈ చర్చ తెరపైకి వచ్చింది.
ప్రపంచ సంస్థలు అందించే ఇంటర్నెట్ సేవలపై ఎక్కువగా ఆధారపడకుండా “ఆత్మనిర్భర్ ఇంటర్నెట్” పై దృష్టి సారించాలని పిలుపునిచ్చారు మంత్రి. రష్యా లో బిగ్ టెక్ కంపెనీలు చేసిన పనిని ఇంటర్నెట్ ఆయుధీకరణగా ప్రస్తావించారు.
కొన్ని రష్యన్ బ్యాంకులు, వాటి అనుబంధ సంస్థలు అంతర్జాతీయ SWIFT నెట్వర్క్ నుండి నిషేధానికి గురైన ఉదాహరణను ప్రస్తావిస్తూ… అదే జరిగితే భారత్ ప్రత్యామ్నాయ ఏర్పాట్లు కలిగి ఉందని… వారిపై ఆధారపడాల్సినఅవసరం లేదని అన్నారు.
భారతదేశంలో UPI, ఫిన్టెక్ ప్లాట్ఫారమ్లు ఉన్నాయి, ఇవి అంతర్జాతీయ నగదు బదిలీ ప్లాట్ఫారమ్ (SWIFT) పై ఆధారపడటాన్ని తగ్గించాయి. ఈ పెద్ద టెక్ ప్లాట్ఫారమ్ లు నియంత్రించే ఇంటర్నెట్ సేవలపై ఆధారపడకూడదని ఆత్మనిర్భర్ భారత్ ద్వారా ఆలోచన చేస్తున్నామని చంద్రశేఖర్ అన్నారు.
ఫిబ్రవరి 24న ఉక్రెయిన్పై రష్యా దండయాత్ర ప్రారంభమైనప్పటి నుంచి…, కంపెనీలు, దేశాలు, బిగ్ టెక్ ప్లాట్ఫారమ్లు రష్యా పౌరులకు అందించే సేవలను నిలిపివేసాయి. చెల్లింపు సేవలను నిలిపివేశారు, పౌరులను పోస్ట్ చేయడానికి అనుమతించకుండా ఆంక్షలు మొదలయ్యాయి. ఈ సంఘటనలు భారత్ ను కలవరపెట్టాయి. డేటా స్థానికీకరణ, రెసిలెంట్ ఇంటర్నెట్ నెట్వర్క్ ఆర్కిటెక్చర్, స్థానిక ఓపెన్ APIలు (అప్లికేషన్ ప్రోగ్రామింగ్ ఇంటర్ఫేస్) సహా బలమైన సైబర్ సెక్యూరిటీ కమాండ్ సెంటర్ కోసం భారత్ చూస్తోంది. అందులో భాగంగానే మేము ప్రాథమికంగా డేటా రక్షణ చట్టం, డిజిటల్ చట్టం సహా ఇతర సైబర్ భద్రతా చట్టాలను కలిగి ఉండే ఫ్రేమ్వర్క్ను రూపొందిస్తామని మంత్రి తెలిపారు.
(మైఇండ్ మీడియా ఫేస్బుక్, ట్విటర్, ఇన్స్టాగ్రామ్ను ఫాలో అవ్వండి. యూట్యూబ్ చానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.)