చైనాలో కోవిడ్ మహమ్మారి మళ్లీ విజృంభిస్తోంది. కేసులు పెరుగుతుండడంతో ప్రపంచదేశాల్లో మళ్లీ వణుకు మొదలైంది.అయితే భారతీయులు ఎక్కువగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదంటున్నారు. ఎయిమ్స్ మాజీ డైరెక్టర్ డాక్టర్ రణదీప్ గులేరియా. కోవిడ్ మహమ్మారి దాడి చేసినపుడు ఆ వైరస్ను నిరోధించగలిగే రోగ నిరోధక శక్తి మనకు ఉండేది కాదని.. ఫలితంగా కొంతమందికి ఇన్ఫెక్షన్ సోకిందని అన్నారు. కానీ ఇప్పుడు ఈ మహమ్మారి వచ్చి మూడేళ్ళు అవుతోందని, అత్యధిక స్థాయిలో సహజంగా ఇన్ఫెక్షన్కు గురైన పరిస్థితి నేడు ఉందని తెలిపారు. మరోవైపు టీకాకరణ విస్తృతస్థాయి వాక్సినేషన్ మన దేశంలో జరిగిందని చెప్పుకొచ్చారు గులేరియా. ఈ వైరస్ను దీటుగా నిభాయించగలిగే స్థాయిలో మన రోగ నిరోధక శక్తి ఉందన్నారు. గతంలో ఆల్ఫా, బీటా, డెల్టా వేరియంట్లు వచ్చాయని, గత ఏడాదిలో కేవలం ఒమిక్రాన్ నుంచి వచ్చిన సబ్ లైనేజెస్ మాత్రమే వస్తున్నాయని తెలిపారు. అయినప్పటికీ మనం అప్రమత్తంగా ఉండాలని..ప్రభుత్వ సూచనలు పాటించాలని అన్నారు. గులేరియా ఇటీవలే ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంటర్నల్ మెడిసిన్ అండ్ రెస్పిరేటరీ అండ్ స్లీప్ మెడిసిన్ చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించారు. మేదాంత హాస్పిటల్ డైరెక్టర్ గా కూడా వ్యవహరిస్తున్నారు.