రష్యా- ఉక్రెయిన్ సంక్షోభం నేపథ్యంలో భారత్ పర్యటకు వచ్చిన రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లవ్ రోవ్ ….భారత విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ తో సమావేశమయ్యారు. ఉక్రెయిన్, ఆఫ్ఘనిస్తాన్, ఇరాన్, ఇండో-పసిఫిక్, ASEAN సహా భారత ఉపఖండంలో ద్వైపాక్షిక సహకారం, అభివృద్ధిపై చర్చించామని జైశంకర్ ట్వీట్ చేశారు. ఈ సందర్భంగా భారత విదేశాంగ విధానాన్ని ప్రశంసించారు రష్యామంత్రి. భారత విదేశాంగ విధానాలు స్వతంత్ర లక్షణం కలిగి ఉన్నాయని, వాటి ప్రధాన లక్ష్యం వాస్తవ జాతీయ సముచిత ప్రయోజనాలపై ఉంటుందని.. రష్యన్ ఫెడరేషన్ విధానం కూడా అదేనన్నారు.
రష్యా-ఉక్రెయిన్ మధ్య జరుగుతున్నదానిని యుద్ధంగా విలేకర్లు పేర్కొనడంపై లవ్రోవ్ అభ్యంతరం తెలిపారు. ‘‘మీరు దీనిని యుద్ధం అని అంటున్నారు. కానీ రష్యాకు ముప్పు కలిగించే సామర్థ్యం ఉక్రెయిన్కు లేకుండా చేయడమే మా లక్ష్యం’’ అని వ్యాఖ్యానించారు. ఇరు దేశాల మధ్య భాగస్వామ్యాన్ని ఏ ఒత్తిడీ ప్రభావితం చేయబోదని, తనకు ఈ విషయంలో ఎటువంటి సందేహం లేదని.. వారు తమ రాజకీయాలను అనుసరించాలని ఇతరులను బలవంతపెడుతున్నారని అమెరికానుద్దేశించి పరోక్ష వ్యాఖ్యలు చేశారు.
భద్రతా సంబంధిత సవాళ్ళను ఎదుర్కొనడంలో అనేక దశాబ్దాల నుంచి భారత్తో ఏర్పరచుకున్న సంబంధాల స్వభావంతో చర్చలు జరుగుతాయన్నారాయన.. సంబంధాలు వ్యూహాత్మక భాగస్వామ్యాలని, ఈ ప్రాతిపదికపైనే తాము అన్ని రంగాల్లోనూ తమ సహకారాన్ని వృద్ధి చేసుకుంటున్నామని తెలిపారు.
ఉక్రెయిన్ సంక్షోభంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మధ్యవర్తిత్వం పై మాట్లాడారు లవ్ రోల్…. భారత దేశం చాలా ముఖ్యమైన దేశమని.. పరిష్కారాన్ని అందించగలిగే పాత్రను భారతదేశం పోషిస్తే అటువంటి ప్రక్రియకు మద్దతివ్వవచ్చునని తెలిపారు. తాము ఉక్రెయిన్ భద్రతకు హామీ ఇవ్వడానికి అనుకూలమేనన్నారు. రష్యా నుంచి డిస్కౌంటెడ్ ఆయిల్ను భారత దేశం కొనబోతోందనే ప్రచారం నడుమ వీరి సమావేశం చర్చనీయాంశం అయింది. ద్వైపాక్షిక వాణిజ్యం సజావుగా జరగడానికి వీలుగా రూపాయి-రూబుల్ పేమెంట్ విధానాన్ని అనుసరించాలని ఇరు దేశాలు ప్రయత్నిస్తున్నాయి. ఇదిలా ఉండగా యుద్ధానికి ముందు ఉన్న ధరలో బ్యారెల్కు 35 డాలర్ల వరకు రాయితీతో హైగ్రేడ్ ఆయిల్ను ఇస్తామని రష్యా ప్రతిపాదించినట్లు సమాచారం.