సరిహద్దులో ఎప్పటికప్పుడు కయ్యానికి కాలు దువ్వుతున్న చైనాకు అదేస్థాయిలో బదులిస్తోంది ఇండియన్ ఆర్మీ. భవిష్యత్తులో కూడా చైనాను ధీటుగా ఎదుర్కొనేలా ప్రాజెక్ట్ జోరావార్ కు శ్రీకారం చుట్టింది భారతసైన్యం. చైనా సరిహద్దులో ఆర్మీ సామర్థ్యాల పెంపునకు వ్యూహాత్మక పథకాలను అమలుచేస్తున్న సైన్యం…ఇక తేలికపాటి జోరావార్ యుద్ధట్యాంకులు, డ్రోన్లను పెద్దఎత్తున సమకూర్చుకోవాలని నిర్ణయించింది. 350 కి పైగా దేశవాలీ యుద్ధట్యాంకులైన జోరావర్లను సిద్ధం చేసుకోనుంది. ప్రాజెక్ట్ జోరావర్ కింద ఈ ప్రక్రియను వేగవంతం చేస్తోంది. తక్కువ బరువుంటే ఈ యుద్ధట్యాంకులు వాయుమార్గాన, అలాగే భూతలంపైనా సులభంగా తరలించే వీలవుతుంది. పర్వతప్రాంత ఆపరేషన్ల కోసం జోరావర్లు సౌకర్యవంతంగా ఉంటాయని సైన్యం తెలిపింది.
జోరావర్ యుద్ధ ట్యాంక్ బరువు 25 టన్నులు. ఈ ఏఎఫ్వీ-ఐఎల్టీ ట్యాంకుల తయారీలో పాటించాల్సిన సాంకేతిక ప్రమాణాలను ఆర్మీ ఇప్పటికే రూపొందించింది. ఈ ట్యాంకుల్లో అధునాతన సాంకేతికతలైన ఏఐ(ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్), డ్రోన్ ఇంటిగ్రేషన్, యాక్టివ్ ప్రొటెక్షన్ సిస్టమ్, హైడిగ్రీ ఆఫ్ సిచ్యువేషనల్ అవేర్నెస్ ఉంటాయి. ప్రాథమిక ఆమోదం కోసం ఈ ప్రమాణాలను రక్షణ మంత్రిత్వశాఖ సెప్టెంబర్లో పరిశీలించనుంది. అధిక ఎత్తు, లోతట్టు ప్రాంతాల్లో నిర్దేశిత పరిధిలోని లక్ష్యాలపై దాడులకుగానూ రెండు ఇండియన్ స్టార్టప్ కంపెనీల నుంచి డ్రోన్లను సమీకరించాలని ఆర్మీ నిర్ణయించింది. ఆ తర్వాత ఏఎస్ఏడీ-ఎస్(అటానమస్ సర్వైలెన్స్ అండ్ ఆర్మ్డ్ డ్రోన్స్ స్వార్మ్) కోసం ‘మేకిన్ ఇండియా’ కార్యక్రమం కింద మరిన్ని డ్రోన్లను ఆర్మీ సమీకరించనుంది.
రెండేళ్లనాడు లద్దాఖ్ లో చైనాతో ఘర్షణ నేపథ్యంలోనే… ఇండియన్ ఆర్మీ ‘ప్రాజెక్ట్ జోరావార్’ను మొదలుపెట్టింది. ఆ సమయంలో ఇరు దేశాలూ పెద్ద సంఖ్యలో ట్యాంకులు, హోవిట్జర్లు, సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్ సిస్టమ్స్ను మోహరించిన సంగతి తెలిసిందే.