ప్రపంచ దేశాల్లో భారతదేశం పేరు మార్మోగిపోతున్నది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నాయకత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం దూర దృష్టితో చేపడుతున్న కార్యక్రమాలు సత్ ఫలితాలు ఇస్తున్నాయి. ప్రపంచం లోనే అగ్రగామి దేశంగా భారత్ ను తీర్చిదిద్దేందుకు మోడీ ప్రయత్నం చేస్తున్నది. ఈ ప్రయత్నాలను ప్రపంచస్థాయి నాయకులు కూడా అభినందిస్తున్నారు.
తాజాగా బ్రిటన్ మాజీ ప్రధాని టోనీ బ్లేయర్ ఓకే ఇంటర్వ్యూలో మాట్లాడుతూ భారత్ ప్రగతిని ప్రశంసించారు. 2050 నాటికి ప్రపంచంలో అగ్రదేశాలుగా అమెరికా, చైనా మరియు భారత నిలుస్తాయి అని ఆయన విశ్లేషణ ఇచ్చారు. ‘ది స్ట్రెయిట్స్ టైమ్స్’కు ఇంటర్వూ ఇస్తూ, ఆ మూడు దేశాలతో రూపుదిద్దుకునే బహుళ ధ్రువ ప్రపంచ వ్యవస్థకు దేశాలు అలవాటు పడవలసిన అవసరం ఉంటుందని చెప్పారు. ‘ప్రపంచంలో మీ దేశం ఏ వైపు ఉండాలో మీరు నిర్ణయించుకోవలసి ఉంటుంది. ఎందుకంటే అది బహుళ ధ్రువ ప్రపంచం కాబోతున్నది’ అని ఆయన సూచించారు. ‘ఈ శతాబ్దం మధ్యభాగానికి మూడు అగ్ర రాజ్యాలుగా అమెరికా, చైనా, బహుశా భారత్ ఉంటాయి’ అని ఆయన పేర్కొన్నారు.
గతంలో ఉన్న పరిస్థితికి ఎప్పటి పరిస్థితికి మార్పు ఉందని ఆయన అన్నారు.
తాను పదవిలో ఉన్న సమయంలో అమెరికా ఆధిపత్యం ఉన్న అగ్ర రాజ్యం అని, అప్పటి కన్నా ఇప్పుడు ప్రపంచ వ్యవస్థ మరింత సంక్లిష్టంగా మారిందని 1997 నుంచి 2007 వరకు బ్రిటిష్ ప్రధానిగా ఉన్న బ్లెయిర్ చెప్పారు. చైనా, భారత్ ఉత్థానం భౌగోళిక రాజకీయాలను తిరిగి రూపుదిద్దుతున్నాయని, కూటములను, దౌత్యపరమైన వ్యూహాలని తిరిగి మదింపు వేయవలసిన అవసరం కనిపిస్తున్నదని ఆయన చెప్పారు. ‘ఒకింత సమాన స్థాయిలో ఆ మూడు అగ్రరాజ్యాలతో మీరు చర్చలు జరపడానికి వీలుగా బలమైన కూటములను నిర్మించుకోవలసి ఉంటుంది’ అని బ్లెయిర్ తెలిపారు.
మధ్య ప్రాచ్యంలో, ముఖ్యంగా ఇజ్రాయెల్, హెజ్బొల్లా తీవ్రవాదుల మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతలు, విస్తృత సంఘర్షణ ముప్పు గురించి కూడా బ్లెయిర్ మాట్లాడారు.
‘అది చాలా ప్రమాదకర పరిస్థితి. మరింత తీవ్రంగా మారే అవకాశం ఉన్నది. ఇజ్రాయెల్ ఉత్తర ప్రాంతంలో ప్రస్తుత సంఘర్షణలే అందుకు కారణం’ అని బ్లెయిర్ పేర్కొన్నారు.
మొత్తం మీద నరేంద్ర మోడీ ప్రభుత్వం సాధిస్తున్న మంచి ఫలితాలను అంతర్జాతీయ స్థాయి నాయకులు ప్రశంసిస్తున్నారు.