కశ్మీర్ విషయంలో మరోసారి నోరు పారేసుకున్న చైనాకు భారత్ గట్టిగానే గడ్డిపెట్టింది. పర్యాటకంపై జీ20 వర్కింగ్ గ్రూపు మూడో సదస్సు జమ్మూకశ్మీర్లో నిర్వహించాలని భారత్ నిర్ణయించింది. 22,23,24 తేదీల్లో జరిగే సదస్సు కోసం భద్రతాదళాలు విస్తృత తనిఖీలు చేపట్టాయి. అయితే వివాదాస్పద భూభాగంలో నిర్వహించే సదస్సుకు తాము హాజరుకాబోవడం లేదని చైనా విదేశాంగ ప్రతినిధి వాంక్ వెన్ బిన్ వ్యాఖ్యనించారు. చైనా ప్రకటనపై భారత్ మండిపడింది. ‘మా సొంత భూభాగంలో ఎక్కడైనా స్వేచ్ఛగా సమావేశాలు నిర్వహిస్తాం. చైనాతో సంబంధాలు సాధారణ స్థితికి చేరుకోవడానికి సరిహద్దుల వెంబడి శాంతి, సుస్థిరత అవసరం’ అని స్పష్టం చేసింది. ఇక టర్కీ, సౌదీ అరేబియా కూడా సదస్సుకు హాజరుకాకపోవచ్చని తెలుస్తోంది.
2019లో జమ్మూకశ్మీర్కు ప్రత్యేక హోదా తొలగించిన తర్వాత జరుగుతున్న అంతర్జాతీయ సమావేశమిది. 60 మందికి పైగా విదేశీ ప్రతినిధులు ఈ సదస్సులో పాల్గొంటారని అంచనా. నేషనల్ సెక్యూరిటీ గార్డ్ (ఎన్ఎస్జీ) దళాలు, మెరైన్ కమాండోల బృందం, సీఆర్పీఎఫ్ సిబ్బంది, ఇతర పారామిలటరీ బలగాలను మోహరించి భద్రతను పర్యవేక్షిస్తున్నారు.