2023లో ప్రతిష్టాత్మకమైన G-20 లీడర్స్ సమ్మిట్ కు భారత్ ఆతిథ్యం ఇవ్వనుంది. అందుకు జమ్మూకశ్మీర్ వేదికవుతోంది. భారత ప్రభుత్వం, విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఈమేరకు ఏర్పాట్లు చేస్తోంది.
కేంద్రపాలిత ప్రాంతమైన జమ్మూ కశ్మీర్ ప్రభుత్వం విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ (MEA)తో సమన్వయం కోసం ఐదుగురు సభ్యుల ప్యానెల్ను ఏర్పాటు చేసింది. G20 శిఖరాగ్ర సమావేశాలలో భారతదేశ ప్రాతినిధ్యం 2014 నుంచి ప్రధాని మోదీ నేతృత్వంలో ఉంది.
G20 దేశాలలో భారతదేశం, అర్జెంటీనా, ఆస్ట్రేలియా, బ్రెజిల్, కెనడా, చైనా, జర్మనీ, ఫ్రాన్స్, ఇండోనేషియా, ఇటలీ, జపాన్, మెక్సికో, రష్యా, సౌదీ అరేబియా, దక్షిణాఫ్రికా, దక్షిణ కొరియా, టర్కీ, యునైటెడ్ స్టేట్స్ సహా యునైటెడ్ కింగ్డమ్ ఉన్నాయి.
ప్రపంచ ఆర్థిక వ్యవస్థ వృద్ధికి, అభివృద్ధికి జి20 అపారమైన సహకారం అందిస్తోందని, తొలిసారిగా భారత్కు సారథ్యం వహించే అవకాశం లభిస్తోందని జి-20 సమ్మిట్ చీఫ్ కోఆర్డినేటర్, మాజీ విదేశాంగ కార్యదర్శి హర్ష్ వర్ధన్ ష్రింగ్లా చెప్పారు.
ప్రధాని మోదీ కోరిక మేరకు భారతదేశంలోని వివిధ ప్రాంతాలలో G20 సంబంధిత సమావేశాల శ్రేణి నిర్వహించనున్నారు. కర్నాటకలో 10 సభలు నిర్వహించేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారు.
జీ20లో భాగమైన అన్ని దేశాలతో కర్ణాటకకు సంబంధాలు ఉన్నాయని.. అందుకే కర్ణాటకలో ఈ సమావేశాలు నిర్వహించడం సముచితమని ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై అన్నారు.
‘ప్రధాని నరేంద్ర మోదీ లాంటి మాస్ లీడర్ మాత్రమే ప్రజల హృదయాల్లో శాశ్వత స్థానాన్ని పొందగలడని… విభిన్న భాషలు, సంస్కృతులు, కులాలు, మతాలకు చెందిన 130 కోట్ల మంది ప్రజల విశ్వాసాన్ని రేకెత్తించి.. వారి ఆకాంక్షలను నెరవేర్చడం అంత సులభం కాదనీ బొమ్మైఅన్నారు.
G20 ప్రపంచంలోని 19 ప్రముఖ ఆర్థిక వ్యవస్థలను, యూరోపియన్ యూనియన్ను కలిపింది. దాని సభ్యులు ప్రపంచ GDPలో 80 శాతానికి పైగా, ప్రపంచ వాణిజ్యంలో 75 శాతం, ప్రపంచ జనాభాలో 60 శాతం వాటాను కలిగి ఉన్నారు.