2029నాటికి ప్రపంచంలోనే మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ అవతరించనుంది. ఈమేరకు ఎస్బీఐ ఓ నివేదికలో పేర్కొంది. జపాన్ ను వెనక్కి నెక్కి మూడో అతిపెద్ద వ్యవస్థగా నిలుస్తుందని తెలిపింది. అంటే 2014తో పోలిస్తే ఏకంగా ఏడుస్థానాలు ఎగబాకనుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో భారత జీడీపీ 13.5 శాతం పెరిగింది. ఈ లెక్కన ఈ ఏడాది భారత్ అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థ కానుంది అని నివేదిక స్పష్టం చేసింది. ఇక ఐఎంఎఫ్ అంచనా ప్రకారం భారత ఆర్థిక వ్యవస్థ గతేడాది డిసెంబర్ నాటికే బ్రిటన్ ను పక్కకు నెట్టి.. ఐదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా నిలిచింది.
2014 నుండి భారతదేశం అనుసరించిన మార్గం 2029లో భారతదేశం 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా గుర్తింపు పొందే అవకాశం ఉందని వెల్లడించింది.ఏ ప్రమాణాల ప్రకారం చూసినా ఇది గొప్ప విజయమని అభిప్రాయపడింది.
ఎనిమిదేళ్ల క్రితం ప్రపంచ జీడీపీలో భారత్ వాటా 2.6 శాతం మాత్రమే. ప్రస్తుతం 3.5 లక్షల కోట్ల డాలర్లతో ఇది 3.5 శాతానికి చేరింది. మరో ఐదేళ్లలో ఇది 4 శాతానికి చేరి జర్మనీని పక్కకు నెట్టి నాలుగో అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదుగుతుందని ఎస్బీఐ అంచనా. పదేళ్ల క్రితం జీడీపీపరంగా చూస్తే బ్రిటన్ ఐదో స్థానంలో ఉంటే, భారత్ 11వ స్థానంలో ఉండేది. ఈ పదేళ్లలో అనేక సవాళ్లు ఎదురైనా భారత ఆర్థిక వ్యవస్థ ఎదుగుతూ వచ్చి, ఇప్పుడు ఐదో స్థానానికి చేరింది.