భారత్ నుంచి నేపాల్ కు రైలు సర్వీస్ రేపటినుంచి ప్రారంభం కానుంది. బిహార్ జయనగర్ నుంచి నేపాల్ లోని కుర్తా మధ్య 34 కిలోమీటర్ల మేర నడిచే రైలు సర్వీస్ ను న్యూఢిల్లీలోని హైదరాబాద్ హౌస్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించనున్నారు. రెండు దేశాల ప్రజలు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ రైలు సర్వీస్ భారత్-నేపాల్ మధ్య ద్వైపాక్షిక సంబంధాలకు మరింత ఊపునిస్తుందని ఇరు దేశాల ప్రతినిధులు తెలిపారు.
నేపాల్లోని కుర్తాకు ఈ రైలులో ప్రయాణించాలనుకునే భారతీయ పౌరులు తమ వెంట కేంద్ర లేదా రాష్ట్ర ప్రభుత్వాలు జారీ చేసిన ఫోటో గుర్తింపు కార్డు, భారత ఎన్నికల సంఘం జారీ చేసిన ఓటరు గుర్తింపు కార్డు లేదా నేపాల్లోని భారత రాయబార కార్యాలయం జారీ చేసిన గుర్తింపు కార్డులను తీసుకెళ్లాల్సి ఉంటుంది.
ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ కోసం విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ (MEA) 784 కోట్ల రూపాయలను మంజూరు చేసింది. జయనగర్ – కుర్తా , బిజల్పురా- కుర్తాల మధ్య వరుసగా మొదటి, రెండవ దశల ప్రాజెక్టు ఇప్పటికే పూర్తయింది. CPRO తూర్పు మధ్య రైల్వే బిజల్పురా మరియు బర్దిబాస్ మధ్య 69 కి.మీల మధ్య మూడవ దశ పనులు శరవేగంగా జరుగుతున్నాయని తెలిపారు.
నేపాల్లోని జైనగర్, బిజల్పురా మధ్య రైలు సర్వీసును 1937లో మొదటిసారిగా బ్రిటిష్ వాళ్లు ప్రారంభించారు. అయితే, 2001లో నేపాల్ వరద కారణంగా రైలు పట్టాలు పూర్తిగా ధ్వంసం కావడంతోనాటినుంచి సేవలు నిలిచిపోయాయి.