భారత్ లో మానవ హక్కుల ఉల్లంఘనలు జరుగుతున్నాయని అమెరికా స్టేట్ సెక్రటరీ బ్లింకెన్ వ్యాఖ్యానించిన కొద్దిరోజులకే తాజాగా అలాంటి కామెంటే చేశారు ప్రెసిడెంట్ బైడెన్. భారత్ లో నియంతృత్వ పోకడలు ఎక్కువయ్యాయనే అర్థం వచ్చేలా బైడెన్ వ్యాఖ్యానించారు. చైనా, రష్యా తీరుపై మాట్లాడుతూ భారత్ పేరునూ ప్రస్తావించారు. డెమోక్రాట్ల ఫండ్ రైజింగ్ విందులో మాట్లాడుతూ… ఇండో పసిఫిక్ ప్రాంతంలో క్వాడ్ కూటమి దేశాలు చైనాకు వ్యతిరేకంగా పని చేస్తున్నాయని జిన్పింగ్ తనకు ఫిర్యాదు చేశారని…అయితే తమకు వ్యతిరేకంగా చైనా తీసుకుంటున్న చర్యలే అమెరికా,ఆస్ట్రేలియా, జపాన్, భారత్ క్వాడ్ రూపంలో ఏకమైనట్టు బదులిచ్చానని చెప్పుకొచ్చారు. రష్యా ఉక్రెయిన్ యుద్దం గురించి మాట్లాడుతూ…పుతిన్ ఆశించిన ఫలితం రాలేదన్నారు.ఇండియాకు సొంత సమస్యలు ఉన్నాయని…రష్యా, చైనా, ఫిలిఫ్పైన్స్ సహా చాలా దేశాల్లో నియంతృత్వాలు ఉన్నాయని అభిప్రాయపడ్డారు. పశ్చిమదేశాల ఆంక్షలతో రష్యాలో రక్షణ ఉత్పత్తుల పరిశ్రమలు కుంటుపడ్డాయని భారత్ ఇక ఆయుధాల కోసం రష్యా మీద ఆధారపడకపోవడమే మంచిదని సలహా ఇచ్చారు బైడెన్. పశ్చిమ దేశాల ఆంక్షలతో కుప్పకూలిన రష్యా ఆయుధ పరిశ్రమ ఎప్పటికీ కోలుకోదన్నారు.
ఇక ఇటీవలే ఇలాంటి వ్యాఖ్యలే చేసిన ఆ దేశ స్టేట్ సెక్రటరీ ఆంటోనీ బ్లింకెన్ చేసిన వ్యాఖ్యలపై విదేశాంగ మంత్రి సుబ్రహ్మణ్యం జైశంకర్ ఘాటుగా స్పందించారు. భారత దేశ విధానాలపై అభిప్రాయాలను ఏర్పరచుకునే హక్కు ఎవరికైనా ఉందని, అయితే అదే సమయంలో వారి గురించి కూడా భారత్ కు అభిప్రాయాలున్నాయని,..తాము కూడా అన్నీ గమనిస్తున్నారని ధీటుగా బదులిచ్చారు జైశంకర్. అందరి ఆసక్తులు, లాబీలు, వాటిని నడిపిస్తున్న ఓటు బ్యాంకుల గురించి ఎప్పుడు చర్చ జరిగినా మాట్లాడుతామని అన్నారు. న్యూయార్క్ లో ఇద్దరు సిక్కులపై దాడి విషయాన్ని ప్రస్తావించి అగ్రరాజ్యం తీరును ఎత్తి చూపారు.
ఉక్రెయిన్ పై యుద్దం చేస్తున్న రష్యాపై తాము సహా ఇతర పశ్చిమ దేశాలు ఆంక్షలు విధించినప్పటికీ రష్యాతో భారత్ సంబంధాలు కొనసాగిస్తుండడం అమెరికాకు మింగుడుపడడం లేదు. దీంతో నేరుగా భారత్ ను కావాలని తప్పుబడుతూ వస్తోంది ఆ దేశం. అందుకు తగినట్టుగా భారత్ సైతం ధీటుగా ఎప్పటికప్పుడు బదులిస్తూ వస్తోంది. న్యూయార్క్ స్టేట్ ఆఫీసుకు ఎన్నికైన తొలి పంజాబీ అమెరికన్ జెన్నిఫర్ రాజ్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం అమెరికాలో భారతీయులపై విద్వేషపూరిత దాడులు ఇటీవల 2 వందలశాతం పెరిగాయి.