చైనాను పక్కకు నెట్టి… ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన దేశంగా భారత్ నిలిచింది. ప్రస్తుతం భారత్ జనాభా 142. 86 కోట్లకు చేరగా…చైనా జనాభా 142.57 కోట్లు. చాలాఏళ్లుగా అత్యధిక జనాభా రికార్డు చైనా పేరునే ఉంది. ప్రపంచంలో మూడింట ఒక వంతు ఆసియా ఖండపు దేశాలైన చైనా, భారత్ లోనే ఉంది. అసలైతే రెండు దేశాల్లో జనాభా పెరుగుదల మందగిస్తోంది. జనాభా పెరుగుదలను కట్టడి చేసేందుకు చైనా కొన్నేళ్లుగా అనేక చర్యలు తీసుకుంటూ వచ్చింది. అదే సమయంలో భారత్ లో జనాభా స్థిరంగా పెరుగుతూనే వస్తోంది. గత ఏడాది చైనా జనాభా ఆరు దశాబ్దాలలో మొదటిసారిగా గణనీయంగా పడిపోయింది. ఆ ప్రభావం ఆదేశ ఆర్థికపరిస్థితిపై తీవ్రంగానే కనిపిస్తోంది. అదే సమయంలో 2011 నుంచి భారత్ జనాభా ఏటా సగటున 1.2 శాతం వృద్ధి నమోదైంది. భారత్ ప్రస్తుతం ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థగా కూడా నిలిచింది. 2050 వరకు భారత జనాభా పెరుగుతూనే ఉంటుందని ఓ అంచనా .
భారత్ లో పదేళ్లకోసారి జనగణన జరిగేది. 2021 లో జనాభా లెక్కింపు జరగాల్సి ఉండగా కరోనా కారణంగా జరగలేదు. ఇక భారత మొత్తం జనాభాలో 50 శాతానికిపైగా 30 ఏళ్ల లోపు వారే ఉన్నారు. అంటే సగం మందికిపైగా యువతే ఉంది. ఇక భారత్, చైనా తరువాత అమెరికా మూడో స్థానంలో నిలిచింది. ప్రస్తుతం అమెరికా జనాభా 34 కోట్లు. ఇక ప్రపంచ జనాభా కూడా ఇటీవలే 800 కోట్ల మైలురాయిని దాటింది. 1974లో ప్రపంచ మొత్తం జనాభా 400 కోట్లుగా ఉండగా.. 48 సంవత్సరాల్లో రెట్టింపైందన్నమాట.
భారత్ విషయానికి వస్తే.. స్వాతంత్ర్యం వచ్చాక తొలిసారి 1951లో జనాభా లెక్కలు నిర్వహించారు. అప్పుడు మన జనాభా 36.1 కోట్లు. ఆతర్వాత 1961లో జనగణనలో 43.89 కోట్లకు చేరింది. పదేళ్లలో దాదాపు 7.79 కోట్ల జనాభా పెరిగింది. 1971లో భారత్ మన జనాభా 54.79 కోట్లు గా ఉంది. అంటే పదేళ్లల్లో 10.9 కోట్ల జనసంఖ్య పెరిగింది. ఇక 1981 లెక్కల ప్రకారం… 71.29 కోట్లు ఉండగా… పదేళ్లలో 16.5 కోట్లు పెరిగింది. 1991లో జనగణన చేయగా… 88.89 కోట్లుగా నమోదైంది. అంటే ఆ పదేళ్లలో 17.6 కోట్ల జనసంఖ్య పెరిగింది. 2001లో నిర్వహించిన జనాభా లెక్కల్లో మన జనాభా 107.9 కోట్లుగా ఉంది. అంటే ఆ పదేళ్లలో 19.01 కోట్ల జనాభా పెరిగింది. 2011లో జనాభా లెక్కలు నిర్వహించారు అప్పటికి మన జనాభా 121.09 కోట్లకు చేరింది. పదేళ్లలో 13.19 కోట్ల జనాభా పెరిగింది. ఒక్కరు లేదా ఇద్దరు ముద్దు అనే నినాదంతో కేంద్రప్రభుత్వం జనాభా నియంత్రణ చర్యలు తీసుకోవడంతో జనాభా పెరుగుదల తగ్గుతూ వచ్చింది.
అసలైతే మళ్లీ పదేళ్లకు అంటే 2021లో జనగణన చేయాల్సి ఉంది. అయితే కరోనా కారణంగా జనాభా లెక్కలు తీయలేదు. ఐక్యరాజ్య సమితి లెక్కల ప్రకారం మన దేశ జనాభా ప్రస్తుతం 142.86 కోట్లకు చేరింది. 2011 నుంచి ఇప్పటి వరకు అంటే 12 ఏళ్లలో 21.77 కోట్ల జనాభా పెరిగింది. ఐక్యరాజ్యసమితి డేటా ప్రకారం భారత్ జనాభాలో దాదాపు పావువంతు 14 ఏళ్లలోపువారు. జనాభాలో 68 శాతంమంది 15 శాతం నుంచి 64 ఏళ్ల వయసువాళ్లు. 7శాతం 65 ఏళ్లపైన వయసువాళ్లు.