భారత్ ను పాలించేది మోడీయా? అమెరికన్ సోషల్ మీడియా!
అమెరికా సోషల్ మీడియా సంస్థల ఆగడాలకు ఇంకా కళ్లెం పడక పోవడం నరేంద్ర మోడీ అభిమానులకు చాలా బాధాకరంగా ఉంది. ట్విటర్, ఫేస్ బుక్ వంటి మాధ్యమాల్లో భారత్ వ్యతిరేక వ్యాఖ్యలు బుసలు కొడుతున్నాయి. రైతుల పేరుతో జరుగుతున్న లొల్లిమీద విదేశీయులు ఇష్టం వచ్చినట్టు కామెంట్లు చేస్తున్నా ట్విటర్ పట్టించుకోవడం లేదు. దీనికి కౌంటర్ గా బాలీవుడ్ నటి కంగనా రనౌత్ చేసిన ట్వీట్లను మాత్రం ట్విటర్ తొలగించింది. ఫేస్ బుక్ లోనూ రాజా సింగ్ వంట దేశభక్తులైన ఎమ్మెల్యేలను తొలగిస్తూ, భారత్ వ్యతిరేక జీహాదీ అనుకూల శక్తుల విద్వేషపూరిత పోస్టులను కొనసాగిస్తున్నారు. అసలు ఫేస్ బుక్, ట్విటర్ లను నిషేధించాలని జాతీయ వాదులు కోరుతున్నారు. ప్రధాన మంత్రి మోడీజీ చెప్పిన వోకల్ ఫర్ లోకల్ అనేది సోషల్ మీడియాకు కూడా వర్తించాలి. మోడీ లాంటి నాయకులు ట్విటర్ ను వాడటం మానెయ్యాలి. చైనా తరహాలో స్థానిక సామాజిక మాధ్యమాలను ప్రోత్సహించాలి.
ఢిల్లీ శివార్లలో రైతుల పేరుతో జరుగుతున్న ఆందోళనలో నిజమైన రైతులు ఎందరు అంటే సరైన సమాధానం దొరకదు. అసలు సిసలైన రైతుల కంటే రైతులు కాని వాళ్లే ఎక్కువ అనే ఆరోపణలు చాలా కాలంగా ఉన్నాయి. రిపబ్లిక్ డే నాడు జరిగిన హింసాకాండ, ఇది రైతు ఉద్యమం కాదని డీటీసీ సౌండులో చాటి చెప్పింది. రౌడీ మూకలమీద మోడీ ప్రభుత్వం ఉక్కు పాదం మోపడానికి బదులు సుతిమెత్తగా వ్యవహరించిందనే విమర్శలున్నాయి. ఢిల్లీ పోలీసులు అల్లర్లను అణచివేయలేకపోయారు. పైగా రౌడీల చేతిలో చావదెబ్బలు తిన్నారు. ఢిల్లీలో శాంతిభద్రతల వ్యవస్థ కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉంటుంది. కశ్మీర్ లో హింసాకాండకు సమర్థంగా కళ్లెం వేసిన మోడీ-షా ద్వయం ఢిల్లీలో అలా చేయడం లేదు. గతంలో షాహీన్ బాగ్, ఇప్పుడు సింఘు ప్రాంతంలో చట్టవ్యతిరేక ఆందోళనను సమర్థంగా ఎదుర్కోక పోవడంపై విమర్శలు వస్తున్నాయి. నిరసన పేరుతో హైవేలను కబ్జా చేస్తే మా పరిస్థితి ఏమిటని సింఘు ప్రాంతంలోని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. వాళ్లు బయటకు వెళ్లలేని పరిస్థితి ఉంది. ఇలా ఎవరిష్టం వచ్చినట్టు వాళ్లు ప్రవర్తిస్తే ఎలా అనేది ప్రశ్న.