తెలంగాణలోని ఐఎస్బీ హైదరాబాద్ 20 ఏళ్ల వేడుకల్లో ప్రధాని నరేంద్ర మోదీ ఈరోజు పాల్గొన్నారు. 2022 పోస్ట్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్ (PGP) క్లాస్ గ్రాడ్యుయేషన్ వేడుకలో కూడా ఆయన ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ ఆత్మనిర్భర్ భారత్ కలలతో భారతదేశం ముందుకు సాగుతోందన్నారు.
“21వ శతాబ్దపు భారతదేశం ‘ఆత్మనిర్భర్ భారత్’, ‘మేక్ ఇన్ ఇండియా’ కలలతో ముందుకు సాగుతోంది. మన స్టార్టప్లు ప్రపంచంపై ఒక ముద్ర వేస్తున్నాయి. నేడు, మనం ప్రపంచంలో మూడవ అతిపెద్ద స్టార్టప్ ఎకోసిస్టం గా ఉన్నాం. భారతదేశపు 100వ యునికార్న్ ఇటీవలే నమోదైంది”అని ప్రధాని మోదీ అన్నారు.
ప్రధాని మోదీ తెలంగాణ సాంకేతిక నైపుణ్యాన్ని కొనియాడారు, “టెక్నాలజీ విషయానికి వస్తే, తెలంగాణలోని యువత సామర్థ్యం లేకుండా ఈ విషయం ఎప్పటికీ పూర్తి కాదు. ఈ సామర్థ్యాలను పూర్తిగా ఉపయోగించుకోవడానికి తెలంగాణకు ప్రగతిశీల, నిజాయితీ ప్రభుత్వం అవసరముంది అని అన్నారు.
“ప్రస్తుతం మనం ప్రపంచంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థలలో ఒకటిగా ఉన్నాం. మన అభివృద్ధిలో సాంకేతికత ప్రధాన పాత్ర పోషిస్తుంది. సాంకేతికతకు మన యువ సహచరులు నాయకత్వం వహిస్తున్నారు” అంటూ యువతను ప్రోత్సహించారు.