భారతదేశం అన్ని రంగాల్లోనూ విజయవంతంగా పురోగమిస్తోంది అని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అభిప్రాయపడ్డారు. భారత్ సాగిస్తున్న ప్రస్థానం ఇతర దేశాలకు స్ఫూర్తిదాయకంగా నిలుస్తోంది అని ఆయన గుర్తు చేశారు. ఆగస్టు 15 స్వతంత్ర దినోత్సవం సందర్భంగా న్యూఢిల్లీలోని ఎర్రకోట ప్రాంగణంలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా మువ్వన్నెల జెండా ఎగురవేసి నరేంద్ర మోదీ గౌరవ వందనం స్వీకరించారు.
స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఎర్రకోట బురుజుల నుంచి దేశ ప్రజలను ఉద్దేశించి నరేంద్ర మోదీ ప్రసంగించారు. దేశం కోసం జీవితాలను పణంగా పెట్టిన మహనీయులు ఎందరో ఉన్నారని.. ప్రాణాలర్పించిన మహనీయులకు దేశం రుణపడి ఉందని ప్రధాని తెలిపారు. భారత్ ప్రస్థానం ప్రపంచానికే స్ఫూర్తిదాయకమని చెబుతూ శతాబ్దాల తరబడి దేశం బానిసత్వంలో మగ్గిందని గుర్తు చేశారు. స్వాతంత్య్రం కోసం ఆనాడు 40కోట్లమంది ప్రజలు పోరాడారని, ఇప్పడు దేశ జనాభా 140 కోట్లకు పెరిగిందని చెప్పారు.
ఈ 140కోట్ల జనం కలలను సాకారం చేయాల్సి ఉందని, ఇందుకు లక్ష్యాన్ని నిర్దేశించుకొని ముందుకు సాగాలని ప్రధాని సూచించారు. కొన్నేళ్లుగా విపత్తులు దేశాన్ని ఇబ్బందిపెట్టాయని పేర్కొంటూ విపత్తు బాధిత కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.
2047 నాటికి వికసిత భారత్ మనందరి లక్ష్యమని ప్రధాని తెలిపారు. భారత్ను ప్రపంచ నైపుణ్యాల రాజధానిగా మార్చాలని, తయారీరంగంలో గ్లోబల్ హబ్గా భారత్ని తీర్చిదిద్దాలని ప్రధాని స్పష్టం చేశారు. ప్రపంచానికే అన్నంపెట్టే స్థాయికి భారత్ ఎదగాలని చెబుతూ దేశాభివృద్ధికి పాలనా సంస్కరణలు అవసరమని స్పష్టం చేశారు.
న్యాయవ్యవస్థలో సంస్కరణలు అవసరమని ప్రధాని అభిప్రాయపడ్డారు. అంతరిక్షంలో భారత స్పేస్స్టేషన్ త్వరలో సాకారం కావాలని అభిలాషను వ్యక్తం చేశారు. మనం అనుకుంటే 2047 నాటికి భారత్ అభివృద్ధి చెందిన దేశంగా మారుతుందని చెప్పారు. వికసిత భారత్ 2047 నినాదం 140కోట్ల మంది కలల తీర్మానమని స్పష్టం చేశారు.
దళితులు, పీడితులు, ఆదివాసీలు గౌరవంగా బతకాలని పేర్కొంటూ వోకల్ ఫర్ లోకల్ అనేది ప్రభుత్వ వ్యూహమని.. వోకల్ ఫర్ లోకల్ నినాదం ఆర్థిక వ్యవస్థలో మార్పులు తీసుకువచ్చిందని చెప్పారు. సర్జికల్ స్ట్రయిక్స్ను దేశ ప్రజలు సగర్వంగా స్మరించుకుంటున్నారని ప్రధాని మోదీ పేర్కొన్నారు. అభివృద్ధి బ్లూప్రింట్గా సంస్కరణలు తీసుకువస్తున్నామని.. నేషన్ ఫస్ట్.. రాష్ట్ర్ హిత్ సుప్రీం సంకల్పంతో ముందుకెళ్తున్నామని ప్రధాని తెలిపారు. బ్యాంకింగ్ రంగంలో ఎన్నో సంస్కరణలు అమలు చేశామని తెలిపారు. భారత బ్యాకింగ్ వ్యవస్థ ప్రపంచంలోనే బలమైందని, జల్జీవన్ మిషన్ ద్వారా 15కోట్ల మందికి లబ్ధి చేకూరిందని పేర్కొన్నారు.
భారత్ చిరుధాన్యాలు ప్రపంచంలోని అందరికీ చేరాలని చెబుతూ భారీ సంస్కరణలు తెచ్చేందుకు ప్రభుత్వం సంకల్పం తీసుకుందని ప్రధాని వెల్లడించాయిరు. దేశాభివృద్ధికి నూతన ఆర్థిక విధానాలు అమలు చేస్తున్నామని, ఉపాధి కల్పనలో గణనీయమైన ప్రగతి సాధించామని, యువతకు నూతన ఉపాధి అవకాశాలు అందుబాటులో ఉన్నాయని వివరించారు.
నేడు ప్రభుత్వమే ప్రజల వద్దకు వెళుతోందని, ప్రభుత్వమే గ్యాస్, కరెంటు, నీరు అందిస్తుందని, యువత నైపుణ్యాభివృద్ధికి ప్రభుత్వమే చర్యలు తీసుకుంటుందని పేర్కొన్నారు. అభివృద్ధి చెందిన భారతదేశం కోసం బాగా ఆలోచించిన ప్రయత్నం జరుగుతోందని చెప్పారు.
ఎర్రకోట స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో కేంద్ర మంత్రులు, ఉన్నతాధికారులు పాలుపంచుకున్నారు.