బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వం మీద భారత్ ఒత్తిడి పెంచుతున్నది. హిందువులు సహా మైనారిటీల భద్రతకు గట్టి చర్యలు తీసుకోవాలని స్పష్టంగా సూచిస్తున్నది. ఈ విషయంలో బంగ్లాదేశ్ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు సక్రమంగా లేవు అన్న సంకేతాలను భారత్ ప్రభుత్వం పంపించింది.
తాజాగా భారత్ బంగ్లాదేశ్ సమావేశం పరిస్థితి తీవ్రతను తెలియజేస్తోంది. భారత విదేశాంగ శాఖ కార్యదర్శి విక్రమ్ మిశ్రి ఢాకాలో బంగ్లాదేశ్ విదేశాంగ శాఖ కార్యదర్శి మొహమద్ జషిమ్ ఉద్దీన్తో ఉన్నత స్థాయి చర్చలు జరిపారు. బంగ్లాదేశ్ ప్రధాని షేఖ్ హసీనా పదవీచ్యుతురాలై, భారత్కు పరారైన దరిమిలా భారతీయ అధికారి ఒకరు జరిపిన తొలి ఉన్నత స్థాయి పర్యటన ఇది. తాను ఢాకాలో మొహమ్మద్ జషిమ్ ఉద్దీన్తో ‘నిర్మొహమాటంగా, దాపరికం లేకుండా, నిర్మాణాత్మకంగా అభిప్రాయాలు మార్పిడి’ చేసుకున్నట్లు మిశ్రి తెలియజేశారు. ‘మైనారిటీల భద్రత, సంక్షేమానికి సంబంధించిన అంశాలతో సహా ఆందోళనలు తెలియజేశాను. సాంస్కృతిక, మతపరమైన, దౌత్యపరమైన ఆస్తులపై శోచనీయ ఘటనలు కొన్నిటి గురించి కూడా చర్చించాం’ అని మిశ్రి విలేకరులతో చెప్పారు.
ద్వైపాక్షిక సంబంధాల సమీక్షకు కూడా ఉభయ పక్షాల మధ్య తమ చర్చలు దోహదం చేసిందని మిశ్రి చెప్పారు. విదేశాంగ శాఖ కార్యదర్శి స్థాయిలో భారతదేశం నిర్మొహమాటంగా తమ అభిప్రాయం తెలియ చెప్పడం.. గట్టి సంకేతం అని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
దీని ప్రభావం రాబోయే కాలంలో రెండు దేశాల సంబంధాల మీద ఉంటుందని భావిస్తున్నారు