చైనాకు దెబ్బ: భారత్ కు భలే చాన్స్!
కాటన్, టమాట ఎగుమతుల విషయంలో చైనాకు భారీ ఎదురు దెబ్బ తగిలింది. చైనాలోని జింజియాంగ్ ప్రాంతం నుంచి ఈ రెండు రకాల ఉత్పత్తుల దిగుమతులను అమెరికా నిషేధించింది. ఆ ప్రాంతంలోని ప్రజలతో చైనా ప్రభుత్వం వెట్టి చాకిరీ చేయిస్తోందనే కారణంతో అమెరికా కస్టమ్స్ అండ్ బార్డర్ ప్రొటెక్షన్ ఈ నిర్ణయం తీసుకుంది. జింజియాంగ్ ప్రాంతంలో యుగర్ ముస్లింలు ఎక్కువ. వాళ్లను డిటెన్షన్ సెంటర్ల పేరుతో జైళ్లలో బంధించారని, వెట్టి చాకిరీ చేయిస్తున్నారని చాలా కాలంగా ఆరోపణలున్నాయి. ఆ ప్రాంతంలో వేలాది మసీదులను కూడా చైనా ప్రభుత్వం కూల్చి వేసిందని వార్తలు వచ్చాయి.
ప్రపంచం మొత్తం మీద ముస్లింల పట్ల అమానుషంగా ప్రవర్తించేది చైనా ప్రభుత్వమే అనే విమర్శలు చాలా కాలంగా ఉన్నాయి. ముస్లింలను బానిసలుగా అమ్ముతున్నారనే ఆరోపణలు కూడా ఉన్నాయి. ముస్లిం మహిళలు ఇక మీదట బిడ్డకు జన్మనివ్వకుండా బలవంతంగా కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేయిస్తున్నారనే ఆరోపణలు కూడా ఉన్నాయి. చైనా సర్కార్ అమానుష కాండకు నిరసనగా తరచూ ఇతర దేశాల్లో నిరసన ప్రదర్శనలు జరుగుతూనే ఉంటాయి.
ఇప్పుడు కాటన్, టమాట ఎగుమతులను పెంచడానికి భారతదేశానికి మంచి అవకాశం లభించింది. ఈ రెండు రకాల ఉత్పత్తులను భారీగా అమెరికాకు విక్రయించే అవకాశాన్ని చేజార్చుకోవద్దని ఆర్థిక వేత్తలు సూచిస్తున్నారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఈ అనుకోని అవకాశాన్ని కచ్చితంగా సద్వినియోగం చేసుకుంటారనే అభిప్రాయం ప్రజల్లో వ్యక్తమవుతోంది. కాబట్టి మనదేశంలోని పత్తి, టమాట రైతులకు ఇది తీపి కబురే అంటున్నారు ఆర్థికవేత్తలు.