భారత్ హిందువులది అని…ప్రపంచంలో ఎక్కడైనా భద్రతలేదని భావించే హిందువులు భారత్ కు వచ్చి ఉండవచ్చని అసోం సీఎం హిమంత బిశ్వశర్మ అన్నారు. బంగ్లాదేశ్ నుంచివచ్చే హిందువులకు పౌరసత్వం ఇస్తారా అనే ప్రశ్నకు ఆయనీవిధంగా స్పందించారు. ప్రపంచంలో ఏ మూలనైనా జీవించే హిందువులకు భారత్ మాతృభూమి అని శర్మ అన్నారు. తమకు సురక్షితం కాదని భావించే ఎవరైనా ఆయా దేశాల నుంచి భారత్ రావొచ్చన్నారు.
CAA , NRC పై తన వైఖరిని స్పష్టం చేశారు సీఎం. మైనారిటీ వర్గాలూ ఎక్కడికీ వెళ్లిపోవాల్సిన అవసరం లేదని…ఆఫ్గనిస్తాన్ లో ఏం జరిగిందో చూసిన వాళ్లు సీఏఏని వ్యతిరేకించరని అన్నారు.
అసోంలో మదర్సాలు స్థాపించి ముల్లాలను తయారు చేయాలని కొందరు అంటున్నారని… తాను మాత్రం మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేసి డాక్టర్లుగా తయారు చేయాలనుకుంటున్నానని… ఇక్కడ ముస్లింలు తమ పిల్లల్ని ముల్లాలుగా చూడాలనుకుంటున్నారా లేక డాక్టర్లుగా చూడాలనుకుంటున్నారా అనేది వారే నిర్ణయించుకోవాలన్నారు.
ముస్లింలకోసం, వారి ఉన్నతి కోసం తాను తీసుకువస్తున్న చర్యలు చూస్తూ హార్డ్ కోర్ హిందూ ఓటర్లు చిరాకు పడతారని తనకు తెలుసనీ అయన అన్నారు. ఇటీవల అసోంలోని దర్రాంగ్ జిల్లాలో బంగ్లాదేశ్ ముస్లిం వలసదారుల ఆక్రమణలో ఉన్న భూమిని ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. ఆక్రమణల్ని తొలగించేందుకు అధికారులు వెళ్లిన సందర్భంలో అక్కడ హింస చెలరేగింది. నిర్వాసితులైన కుటుంబాల్లో…పౌరసత్వం ఉన్నవారికి మాత్రమే పునరావాసం కల్పిస్తామని ప్రభుత్వం స్పష్టం చేసింది.
అసలు దేశంలో కానీ, అసోంలో కానీ ఈ దుస్థితికి కారణం గాంధీ,నెహ్రూ కుటుంబమేనని అన్నారు. దేశం ఎదుర్కొంటున్న చాలా సమస్యలను ఆ ఒక్క కుటుంబమే సృష్టించిందన్నారు. అసోం మిజోరం ఘర్ణణనూ శర్మ గుర్తుచేస్తూ… 1972లో సరిహద్దు సమస్యను కాంగ్రెస్ పరిష్కరించకపోవడమే ప్రస్తుత సంక్షేభాలు, చికాకులకు కారణమన్నారు.