పాకిస్తాన్తో దాడుల విషయంలో ప్రస్తుతానికి విరామం తీసుకున్నట్లు తెలుస్తోంది. రెండు దేశాలు అకస్మాత్తుగా కాల్పుల విరమణ చేపట్టాలని, పరస్పరం దాడులను నిలిపి వేసుకోవాలని నిర్ణయించుకున్నాయి. భారత విదేశాంగ శాఖ కార్యదర్శి విక్రమ్ మిస్రీ అధికారికంగా ఈ విషయం ప్రకటించారు. ఈ ఒప్పందం తక్షణమే అమల్లోకి వచ్చేసింది . సరిహద్దు ప్రాంతాల్లో శాంతియుత వాతావరణానికి ఇది దోహదపడుతుందని భావిస్తున్నారు.
కాల్పుల విరమణ వివరాలను మిస్త్రీ అధికారికంగా వివరించారు.
భారత కాలమానం ప్రకారం సాయంత్రం 5 గంటల నుంచి భూమి, గగనతలం మరియు సముద్ర మార్గాల్లో అన్ని రకాల కాల్పులు, సైనిక కార్యకలాపాలను నిలిపివేయాలని ఇరు దేశాలు అంగీకరించినట్లు విక్రమ్ మిస్రీ వెల్లడించారు. ఈ మేరకు పాకిస్థాన్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్స్ (డీజీఎంఓ) ఈ మధ్యాహ్నం భారత డీజీఎంఓతో ఫోన్లో సంభాషించారని, ఈ సంభాషణలోనే ఇరుపక్షాలు ఈ నిర్ణయానికి వచ్చినట్లు ఆయన తెలిపారు.
ఇరు దేశాల సైనిక ఉన్నతాధికారులు మే 12వ తేదీన మరోసారి చర్చలు జరపనున్నారని భారత విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీ పేర్కొన్నారు. ఈ చర్చల్లో సరిహద్దుల్లో శాంతిభద్రతల పరిరక్షణ, భవిష్యత్ కార్యాచరణపై మరింత స్పష్టత వచ్చే అవకాశం ఉంది.
ఇక్కడ మరో విషయం గమనించాలి. అంతకు ముందు, అమెరికా మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ తన బృందం సుదీర్ఘ చర్చల అనంతరం భారత్, పాకిస్థాన్ మధ్య ‘సంపూర్ణ మరియు తక్షణ కాల్పుల విరమణ’కు మధ్యవర్తిత్వం వహించిందని ప్రకటించారు. ఈ ప్రకటన వెలువడిన కొద్దిసేపటికే న్యూఢిల్లీ నుంచి అధికారిక ప్రకటన వెలువడటం గమనార్హం. అటు, పాక్ నుంచి అందించిన సమాచారం ప్రకారం, ఈ కాల్పుల విరమణ ఒప్పందం తక్షణమే అమల్లోకి వచ్చినట్లు తెలుస్తోంది.
రెండు పక్షాలు కాల్పుల విరమణ పాటించడం భారత ఉపఖండంలో కొంతమేర ప్రశాంతత ఏర్పడుతుందని భావిస్తున్నారు. పాకిస్తాన్ మరోసారి ఉగ్రవాద చర్యలకు పాల్పడితే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో సహించేది లేదని,, అంతకు అంతా బదులు తీర్చుకుంటామని మరోసారి భారత్ స్పష్టం చేసింది.