కోవిషీల్డ్ టీకా రెండుడోసులు తీసుకున్నప్పటికీ భారత్ నుంచి వచ్చే వాళ్లు క్వారెంటైన్లో తప్పకుండా ఉండాలన్న బ్రిటన్ ప్రభుత్వ నిబంధనలపై భారత్ మండిపడింది. నిబంధనల్ని వెనక్కి తీసుకోకుంటే ప్రతిచర్య ఉంటుందని హెచ్చరిస్తూ భారత విదేశాంగశాఖ ప్రకటన విడుదల చేసింది. భారత్లో తయారైన టీకాలను వినియోగించుకుంటూ…. భారతీయులపట్ల వివక్షాపూరితంగా వ్యవహరించడం ఏంటని ప్రశ్నించింది.
విదేశీ ప్రయాణికులకు అమలు చేసే కోవిడ్ నిబంధనలపై రెండు రోజుల క్రితం ఒక ప్రకటన విడుదల చేసింది బ్రిటన్. అక్టోబర్ 4 నుంచి బ్రిటన్ వచ్చే భారత్ సహా ఇతర దేశాల నుంచి వచ్చే ప్రయాణికులు కోవిషీల్డ్ టీకా రెండు డోసులు వేసుకున్నప్పటికీ క్వారంటైన్లో తప్పనిసరిగా ఉండాలని అందులో పేర్కొంది.