ఢిల్లీ ఎమ్మెల్యేల జీతభత్యాలు పెరిగాయి. ఎమ్మెల్యేల వేతనాన్ని 66శాతం పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. ఈ పెంపుతో ప్రస్తుతం ఉన్న నెలవారీ జీతం, అలవెన్సులు రూ.54,000 నుంచి రూ.90,000కి పెరుగుతాయి.
సీఎం కేజ్రీవాల్ అధ్యక్షతన గతేడాది ఆగస్టులో ఈ పెంపు ప్రతిపాదనను కేబినెట్ ఆమోదించింది. దేశంలో అత్యల్ప జీతం తీసుకుంటున్న ఎమ్మెల్యేలు ఢిల్లీవాళ్లేనని ప్రతిపాదనను ఆమోదించాలని కేంద్ర హోంమంత్రిత్వశాఖనూ అభ్యర్థించింది.
“బీజేపీ, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలు ప్రస్తుతం 1.5 నుండి 2 రెట్లు ఎక్కువ జీతాలు, అలవెన్సులు చెల్లిస్తున్నాయి. కేంద్రం విధించిన ఆంక్షల వల్ల ఢిల్లీ ఎమ్మెల్యేలు దేశంలోనే అత్యల్పంగా సంపాదిస్తున్న ఎమ్మెల్యేల్లో ఒకటిగా నిలిచారు’’ అని పార్టీ ఎమ్మెల్యేలూ అసంతృప్తి వ్యక్తం చేశారు పలుమార్లు.
కేజ్రీవాల్ ప్రభుత్వం 2015 సంవత్సరంలో ఎమ్మెల్యేలకు రూ. 54,000 జీతం ప్రతిపాదించింది, అయితే MHA ఆ ప్రతిపాదనను తిరస్కరించింది. ప్రాథమిక వేతనాన్ని రూ. 30,000కి పరిమితం చేసింది. భారతదేశంలోని చాలా ప్రాంతాల కంటే ఢిల్లీలో జీవన వ్యయాలు ఎక్కువగా ఉన్నప్పటికీ, అనేక బిజెపి, కాంగ్రెస్ మరియు ప్రాంతీయ పార్టీల పాలిత రాష్ట్రాలు తమ ఎమ్మెల్యేలకు చాలా నెలవారీ జీతాలు అందిస్తున్నాయని ఢిల్లీ ప్రభుత్వం గుర్తించింది.
గతంలో ఎమ్మెల్యేలకు నెలకు రూ.12,000 జీతం, మిగిలిన మొత్తాన్ని అలవెన్స్గా కలిపి రూ.54,000 చెల్లించేవారు. ఇప్పుడు ఢిల్లీ ఎమ్మెల్యేల జీతంతోపాటు అలవెన్సులు రూ.90,000కి పెంచారు.
అలాగే నియోజకవర్గ భత్యం రూ.18 వేల నుంచి రూ.25 వేలకు, సెక్రటేరియల్ అలవెన్స్ రూ.10 వేల నుంచి రూ.15 వేలకు, టెలిఫోన్ అలవెన్స్ రూ.8 వేల నుంచి రూ.10 వేలకు, కన్వేయన్స్ అలవెన్స్ రూ.6 వేల నుంచి రూ.10 వేలకు పెంచారు. అలాగే, ఢిల్లీ ఎమ్మెల్యేలు ఇప్పుడు అసెంబ్లీ సమావేశాలు లేదా కమిటీ సమావేశాలకు హాజరయ్యేందుకు రోజువారీ భత్యం రూ. 1,000 (సంవత్సరానికి గరిష్టంగా 40 రోజులకు లోబడి), రూ. 4,00,000 వరకు రవాణా అడ్వాన్స్ (కార్యాలయ వ్యవధిలోపు తిరిగి చెల్లించవచ్చు)కు అర్హులు. వైద్య సదుపాయాలు, విద్యుత్ మరియు నీటి సౌకర్యం కోసం నెలకు రూ. 4,000, వార్షిక ప్రయాణ సౌకర్యం రూ. 50,000, ఇద్దరు డేటా ఎంట్రీ ఆపరేటర్లను నియమించుకోవడానికి నెలకు రూ. 30,000.
ఢిల్లీ ఎమ్మెల్యేల జీతం,అలవెన్సుల పెంపు ప్రతిపాదన గత 7 సంవత్సరాలుగా MHA వద్ద పెండింగ్లో ఉంది.2011లో చివరిసారి సవరించారు.