గణతంత్రంలో రణతంత్రం
భారతీయ సాయుధ బలగాల్లో మహిళా సాధికారత గత ఐదేళ్లుగానే కనిపిస్తున్నది. నరేంద్ర మోడీ హయాంలో మహిళా సైనికులు, పైలట్లు సత్తాను చాటుతున్నారు. చరిత్రలో తొలిసారిగా మంగళవారం 72వ గణతంత్ర దినోత్సవ పరేడ్ లో ముఖ్యంగా ముగ్గురు మహిళలు అందరికీ స్ఫూర్తినిచ్చారు. ఈ పరేడ్ లో పాల్గొనే అవకాశం పొందిన వారిలో ఫ్లైట్ లెఫ్టినెంట్ భావనా కాంత్ వయసు 28 ఏళ్లు. ఫ్లైట్ లెఫ్టినెంట్ స్వాతి రాథోడ్ కూడా ఈ వేడుకల్లో గగన తలంలో యుద్ధవిమానం నడుపుతూ మహిళా శక్తికి ఆకాశమే హద్దు అని చాటిచెప్పారు. ఏకలవ్య ఫార్మేషన్ లో ఐదు యుద్ధ విమానాల విన్యాసాలు అదరహో అనిపించాయి. రుద్ర విమానాలు రయ్యిమని దూసుకుపోయాయి.
ఇండియన్ ఆర్మీలోనూ ఒక మహిళా సైనికురాలు రాజ్ పథ్ లో కదం తొక్కారు. 140వ ఎయిర్ డిఫెన్స్ రెజిమెంట్ కు చెందిన కెప్టెన్ ప్రీతి చౌధరి నవీకరించిన షిల్కా వెపన్ సిస్టం పరేడ్ కు నాయకత్వం వహించారు. అత్యాధునిక రాడార్ వ్యవస్థ, డిజిటల్ ఫైర్ కంట్రోల్ కంప్యూటర్లతో ఈ యుద్ధ ట్యాంకును మరింత శక్తివంతంగా ఆధునీకరించారు. రాఫెల యుద్ధ విమానంతో పాటు బ్రహ్మోస్ క్షిపణి, పినాక మల్టీ బ్యారెల్ రాకెట్ లాంచర్ తదితర అత్యాధునిక సాయుధ సంపత్తిని భారత్ ప్రదర్శించింది.
ఇక రాష్ట్రాల శకటాల విషయానికి వస్తే లేపాక్షి థీమ్ తో ఆంధ్ర ప్రదేశ్ శకటం కనువిందు చేసింది. కేంద్ర పాలిత ప్రాంతం లడఖ్ శకటం సాంస్కృతిక, భౌగోళిక వైవిధ్యాన్ని కళ్లకు కట్టింది. ఈశాన్యంలోని త్రిపుర శకటం ప్రత్యేకంగా కనిపించింది. ఉత్తరాఖండ్ పర్యాటక, ఆధ్మాతిక శోభను ఆ రాష్ట్ర శకటం కళ్లకు కట్టింది. ఉత్తర్ ప్రదేశక శకటం అయోధ్య రామాలయ నమూనాను ఆవిష్కరించింది. బెంగాల్ శకటం చదువు విద్య ప్రాముఖ్యాన్ని చాటిచెప్పింది. అస్సాం టీ తోటల థీమ్, అలాగే అరుణాచల్ ప్రదేశ్, ఛత్తీస్ గఢ్, పంజాబ్, గుజరాత్, కర్నాటక, మహారాష్ట్ర, కేరళ, తమిళనాడు, సిక్కిం రాష్ట్రాల శకటాలు ఆకట్టుకున్నాయి.