ప్రభుత్వ యంత్రాంగాల వైఫల్యాల కారణంగా మూల్యం చెల్లించుకోవాల్సింది చివరకు ప్రజలే..
చిన్నా చితక పనులు, ఉద్యోగాలు చేసే మధ్యతరగతి ప్రజలకు సొంత ఇళ్లు జీవితకాల స్వప్పం.. దాన్ని నెరవేర్చుకునే లోపు వారు ఈ లోకంలోనే ఉండక పోవచ్చు.. ఇళ్లు కట్టుకోవడానికి ముందు స్థలం కొనాలి, అనుమతులు తీసుకోవాలి.. బద్దకపు అధికారులు చేసే జాప్యాల కారణంగా మనం కొన్న భూమిని ఎవడో అక్రమిస్తాడు. ఇదేమిటంటే కండబలం, ధన బలంతో బెదిరిస్తాడు.. కోర్టులో తేల్చుకోమంటాడు.. న్యాయం మన తరపున ఉంది కదా అని మనం ఏళ్ల తరబడి తీర్పుకోసం ఎదురు చూస్తుంటాం.. ఈలోగా మన స్థలం ఎన్నో చేతులు మారి వేలు, లక్షలు, కోటి దాటిపోయి మధ్యలో ఎంతో మంది లాభపడతారు. అసలు లబ్దిదారుడు మాత్రం కోర్టుకు, అడ్వకేటుకు ఫీజులు చెల్లించుకుంటూ ఆర్థికంగా దివాళా తీస్తాడు.. దురదృష్టవశాత్తు చనిపోతే వారసులు ఆ పోరాట కాడిని ఎత్తుకుంటారు.. ఆ వారసుల్లో కొందరు ఆసక్తి కోల్పోయి వదిలేస్తారు..
అంతిమంగా న్యాయం గెలుస్తుందేమో.. కానీ అనుభవించే అసలు లబ్దిదారు పరలోకంలో ఉంటాడు..
హైదరాబాద్ యూసుఫ్గూడ కల్యాణ్నగర్ సొసైటీ కేసులో 43 ఏళ్ల పాటు సాగిన వివాదంలో 24 ఏళ్లకు న్యాయం జరిగిందట.. స్థానిక ఎమ్మెల్యే ఓటు బ్యాంకు రాజకీయాలకు సొసైటీ సభ్యులు ఇబ్బందులకు గురయ్యారు. పాపం వీరిలో ఎంత మంది బతికి ఉన్నారో తెలియదు.. వారి కుటుంబాలకు రూ.2,000 కోట్లు ప్రభుత్వం చెల్లించాలి. ప్రభుత్వ అంటే ఎవరోకాదు.. మన పన్నులలో నడిచే యంత్రాంగం కదా.. అంతిమంగా ప్రజల సొమ్ముకే బొక్క.. హైదరాబాద్ మహానగరంలో ఇలాంటి కథలు, వ్యధలు ఎన్నో ఉన్నాయి.. సైదాబాద్ దగ్గర ఉన్న సింగరేణి వివాదాన్ని నేను కళ్లారా చూస్తున్నాను..
రాజశేఖరరెడ్డి ప్రభుత్వ హయంలో జర్నలిస్టుల కోసం ఇళ్ల స్థలాలు కేటాయిస్తే, కన్ను కుట్టిన కొందరు దుర్మార్గులు కోర్టుకుపోయారు. హైకోర్టు కొట్టేస్తే, సుప్రీంకోర్టుకు వెళ్లారు. దశాబ్దన్నర గడచిపోయింది. కోర్టు వాయిదాల మీద వాయిదాలు వేస్తోంది. కేటాయించిన స్థలం కబ్జాకు గురవుతోంది.. మా జర్నలిస్టు మిత్రులు కొందరు సొంతింటి కల నెరవేరకుండానే లోకం విడచిపోతున్నారు.. అంతిమంగా న్యాయం గెలుస్తుందేమో.. చూద్దాం ఆ వేడుక చేసుకోవడానికి ఎంత మంది మిగిలి ఉంటామో..