కేరళలో… జై తెలంగాణ!!
ప్రత్యేక రాష్ట్రం కోసం ఎలా పోరాటం చేయాలంటే తెలంగాణను చూసి నేర్చుకోవాలంటారు చాలా మంది. ఇప్పుడు కేరళలోని ఒక ప్రాంతంలో కూడా ప్రత్యేక రాష్ట్రం కోసం ఆందోళన మొదలయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. మలబార్ అనే మాటను చాలా మంది వినే ఉంటారు. కేరళలోని ఒక ప్రాంతం పేరు. ముఖ్యంగా కేరళ ఉత్తర భాగంలోని సముద్రతీర ప్రాంతం మలబార్ గా పేరు పొందింది. ఇక్కడ ముస్లింల జనాభా ఎక్కువని, తాము మెజారిటీగా మారామని కొందరు ఆ మతానికి చెందిన నాయకులు చెప్తున్నారు. ప్రత్యేక మలబార్ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయకపోతే త్వరలోనే తెలంగాణ తరహాలో ఉద్యమం లేవదీస్తామని సమస్త కేరళ సున్నీ స్టూడెంట్స్ ఫెడరేషన్ నాయకుడు ఇటీవల హెచ్చరించారు. అక్కడి సిపిఎం ప్రభుత్వం దక్షిణ కేరళను పట్టించుకుంటూ తమ ప్రాంతాన్ని నిర్లక్ష్యం చేస్తోంది అనేది ప్రధాన ఆరోపణ.
మలబార్ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసి కోజికోడ్ నగరాన్ని రాజధానిగా ప్రకటించాలనేది ఈ సంస్థ డిమాండ్. కోజికోడ్ కేరళ తీరప్రాంతంలోని ప్రధాన నగరాల్లో ఒకటి. వీలైనంత త్వరగా కేరళను ముస్లిం మెజారిటీ రాష్ట్రంగా చేస్తామని ఆ మధ్య కొన్ని సంస్థలు ప్రకటించాయి. జనాభా నియంత్రణ లేకపోవడంతో అక్కడ ముస్లిం జనాభా వేగంగా పెరుగుతోంది. యావత్ కేరళ ముస్లిం మెజారిటీగా ఎప్పుడు మారుతుందో తెలియదు గానీ, మలబార్ ను మాత్రం ప్రత్యేక రాష్ట్రంగా చేయాలనే డిమాండ్ క్రమంగా బలపడుతోంది. ఏప్రిల్ 6వ తేదీన కేరళలో అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ ఎన్నికల్లో ప్రత్యేక రాష్ట్ర డిమాండ్ ప్రభావం ఎలా ఉంటుందో.