పీ.కే. వివరించిన ప్రణాళిక ప్రకారం నీతీశ్ కుమార్ రాష్ట్రపతి అభ్యర్థి అయితే గెలువగల అవకాశాలున్నాయి. అయినా ఆయన అందుకు ఇష్టపడక ప్రధానమంత్రి పదవి అనే కొండకే ఆశాపాశమనే వెండ్రుకను కట్టి లాగదల్చుకొని, ఎన్డీఏ బృందంనుండి మహాగటబంధన్ అనేమందలోకి వచ్చిపడ్డాడు.
పీకే ప్రధానమంత్రి పదవికి చాలామందిని ముస్తాబు చేస్తున్నాడు. వీళ్లెవరికీ ప్రధానమంత్రికాగల సామర్థ్యము, అవకాశాలూ లేవని అతనికి తెలుసు. అయినా నడుము బిగించి ముందుకు వచ్చేవాడు కనీసం ఒకడైనా ఉండాలిగదా, అప్పుడేగదా, ఆట ముందుకు సాగేది! అని అతని ఆలోచన.
ప్రతిపక్షాలనుండి ఒకనికంటే ఎక్కువమంది పోటీ పడితే ఏమిచేయాలి? “మొదట్లో అంతా మన ప్లాను ప్రకారమే నడిచింది. కాని మధ్యలో……ఆ ఒక్కచోట నన్ను అడక్కుండా మీరు తొందరపడి పోయారు. దానితో మనకు లభించవలసిన అవకాశం వెండ్రుక వాసిలో చేజారింది, జాగ్రత్తగా అడుగులు వేస్తే ఈ సారి నిస్సందేహంగా గెలుపు మనదే” అని నమ్మించటం అతనికి చేతకాని విద్య కాదు.
పీ.కే చేత ప్రేరితుడై ప్రధానమంత్రి పదవిపై ఆశ పెట్టుకొన్న వారిలో కేసీఆర్ ఒకడు. మిగిలిన ప్రధాన మంత్రి అభ్యర్థులకంటే ఇంగ్లీషు, హిందీ తాను బాగా మాట్లాడగలనని ఆయనకు బాగా నమ్మకం ఉంది. అది తనకు వరప్రసాదమై తనను అగ్రభాగాన నిల్పుతుందని ఆయన విశ్వసిస్తున్నారు.
అటువంటి స్థితిలో అవిఘ్నమస్తు అనుకొంటూ కేసీఆర్ వినాయక చవితినాడు బిహారు చేరు కున్నారు. నీతీశ్ కుమార్, తేజస్వీ యాదవ్ ల సమక్షంలో పత్రికలవారితో మాట్లాడు తున్నపుడు “నీతీశ్ కుమార్ ను ప్రధానమంత్రి అభ్యర్థిగా ముందుకు తీసుకువస్తారా?”అని ఎవరో ప్రశ్నించారు.
ఇది ఊహించని ప్రశ్న. భాజపాను ఓడగొట్టాలని కోరుతున్నవా రందరమూ కలిసికూర్చొని, చర్చించు కొని నిర్ణయం తీసుకొంటామని తాము అనుసరించ గోరే విధానాన్ని వివరిస్తూ, అడిగిన ప్రశ్నకు సూటిగా సమాధానం చెప్పకుండా తప్పించుకో చూశాడు.
ఆ పాత్రికేయుడు ఎవరోగాని, అంత తేలికగా కేసీఆర్ ను వదలలేదు. రెట్టించి మళ్ళీ అడిగాడు. ఈ దశలో తమ క్రీడ ‘మిస్ ఫైర్’ అవుతుందేమోనని నీతీశ్ కి భయంవేసింది. ఈ త్రాగుబోతు పొరపాటున తాను (కేసీఆర్) కూడా రంగంలో ఉన్నట్లుగా నోరుజారి నట్లయితే, అది తనకు (నీతీశ్ కు) గల అవకాశాలను దెబ్బతీసే దవుతుంది. తనను తన మొహంమీదే అవమానించట మవుతుంది. అందుకని ఆయన లేచి, నిలబడి, పత్రికాగోష్ఠిలో పాల్గొన్నవారందరికీ ధన్యవాదాలు ప్రకటించి గోష్ఠి ముగిసినదని సూచించాడు.
పండుగనాడు కేసీఆర్ కి పెద్ద అవమానమైపోయింది. తాను పదేపదే బ్రతిమిలాడినా వినకుండా, గోష్ఠి కొన సాగించడానికిగాని, తాను జవాబివ్వడానికి అవకాశ మివ్వకుండా అది అర్ధాంతరంగా ముగిసిపోయింది.
మరి ఇప్పటికైనా మన బహుభాషావేత్తయైన ప్రధాన మంత్రి అభ్యర్థికి తత్వం బోధపడిందో లేదో? ప్రధాన మంత్రి పదవి అధిష్ఠించడానికి అభ్యర్థిని తీసుకు పోయేందుకు రథం ఖాళీగా ఉంది. ఎక్కి కూర్చోవటమే ఆలస్యంగా అది బయలుదేరుతుంది అనుకొంటే అంతకంటే అమాయకత్వం ఉండదు. మమతా బెనర్జీ, శరద్ పవార్, ఎం.కె. స్టాలిన్, కుమారస్వామి వంటి కాంగ్రెసేతర పక్షాలనేతలెందరో ఆ రథం ఎక్కడానికి ఉవ్విళ్లూరుతున్నారు. వా రందరినీ త్రోసిరాజని తాను అధిరోహించటం అంత సులభం కాదు.
కాగా ఆయనను ఇరుకున పెట్టిన మరో ప్రశ్నా ఎదురైంది. “మీరు చేయబోతున్న బృహత్ ప్రయత్నంలో కాంగ్రెసుకు ఏమైనా పాత్ర ఉందా లేదా?” పచ్చి వెలక్కాయలాంటి ఈప్రశ్నను ఆయన ఊహించలేదు. ‘ఉంది’ అంటే రేపటినుండి రేవంత్ రెడ్డి వచ్చి తన నెత్తిన కూర్చుంటాడేమోనన్న భయం ఒకవైపు. రాహుల్ గాంధీని పల్లకీలో కూర్చోబెట్టి మోయవలసివస్తుందేమోనన్న భయమూ ఉంది. ‘లేదు’ అంటే మేము వెఱ్ఱివాళ్లమై కాంగ్రెసుకు ఇక్కడ స్థానం కల్పించా మనుకున్నావా?, కాంగ్రెసు లేకుండా ప్రతిపక్ష కూటమి ఊహకే అందదుగదా అని తన ప్రక్కన కూర్చొన్న బిహారు నాయకగణం తగాదాకు దిగుతారన్న భయం మరోవైపు….
ఇలా గందరగోళం మధ్య పత్రికా గోష్ఠి ముగిసింది. వీరి బుఱ్ఱ లలో ఉన్నవి అస్పష్టమైన ఆలోచనలేగాని, స్పష్టమైన కార్యప్రణాళికగాని, సమ్యక్ దృష్టిగానీ లేవని తేటతెల్లంగా తెలిసిపోయింది. తెలంగాణ ముఖ్యమంత్రి పరువు గంగపాలయ్యింది.
మరి ఇంతటి ప్రహసనంనుండి ఆయన ఏమైనా నేర్చుకొన్నాడా? అది ఇప్పుడే చెప్పటం చాలా కష్టమేనని మీ అందరికీ తెలిసిన విషయమేగదా!