గుజరాత్ లో సబర్మతి నదిపై నిర్మించిన అటల్ బ్రిడ్జిని ప్రధాని మోదీ ప్రారంభించారు. ఎల్లిస్ బ్రిడ్జ్-సర్దార్ వారధి మధ్య సబర్మతి నదిపై నిర్మించిన ఈ వంతెన స్థానికులను ఆకట్టుకుంటోంది. ఇకనుంచి బయటినుంచి వచ్చే పర్యాటకులనూ అలరించనుంది. అంత సుందరంగా దీన్ని తీర్చిదిద్దారు. అయితే ఇది కేవలం పాదచారుల వంతెననే.
ఎల్ఈడీ వెలుగుల్లో కాంతులీనుతున్న వంతెన ఫొటోను ప్రారంభానికి ముందు ప్రధాని ట్విట్టర్లో షేర్ చేస్తూ ..దాని విశేషాలు తెలిపారు. ఈ అటల్ బ్రిడ్జ్ పొడవు దాదాపు 300 మీటర్లు, వెడల్పు 14 మీటర్లు. దీనిని 2,600 మెట్రిక్ టన్నుల స్టీల్ పైపులతో నిర్మించారు. ఈ వంతెన పైభాగాన ఫ్యాబ్రిక్ను ఉపయోగించారు. రెయిలింగ్ను గ్లాస్, స్టెయిన్లెస్ స్టీల్తో నిర్మించారు. సబర్మతి నదికి పశ్చిమ దిశలో ఉన్న పూల తోటను, తూర్పు దిశలో రాబోతున్న సాంస్కృతిక కేంద్రాన్ని ఈ వంతెన కలుపుతుంది. పాదచారులతోపాటు సైకిలిస్టులు కూడా దీన్ని వాడవచ్చు.వంతెన పైనుంచి వెళ్తూ నదీతీరం అందాల్ని ఆస్వాదించవచ్చు.
అటల్ బ్రిడ్జ్ అద్భుతం కదా అంటూ ట్వీట్ చేసిన మోదీ…కొన్ని ఫొటోలు జతచేశారు.
https://twitter.com/narendramodi/status/1563564496610017280?s=20&t=ywboLSGW1H–k8MRMKKLog