క్షమించండి..చెవులు పట్టుకుని బస్కీలు తీసి.. బీజేపీలో చేరిన నేత.. ఎందుకో తెలుసా..?
https://twitter.com/MrsGandhi/status/1367405968074502147
ఎన్నికలు వస్తున్నాయంటే చాలు.. రాజకీయ నేతలు ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు వింత చేష్టలు చేస్తుంటారు. వాటిని చూస్తే సినిమాలో వచ్చే జోక్స్ను కూడా బీట్ చేస్తుంటాయి. తాజాగా దేశంలో నాలుగు రాష్ట్రాలతో పాటు.. ఒక కేంద్ర పాలిత ప్రాంతానికి అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అన్ని పార్టీలు ప్రచారంలో దూసుకెళ్తున్నాయి. ఇటీవల కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడు, వయనాడ్ ఎంపీ రాహుల్ గాంధీ బస్కీలు తీసిన సంగతి తెలిసిందే. ఇక ప్రియాంకా వాద్రా కూడా అసోం ప్రచారంలో నృత్యాలు, తేయాకు తోటలో
హల్చల్ చేసిన సంగతి తెలిసిందే. తాజాగా వెస్ట్ బెంగాల్లో ఓ నేత తప్పయ్యింది.. నన్ను క్షమించండి అంటూ స్టేజ్పైనే చెవులు పట్టుకుని బస్కీలు తీశాడు. సదరు నేత చేసిన ఫీట్లు చూసి.. అంతా నవ్వుకున్నారు. అంతేకాదు.. విజిల్స్ వేస్తూ.. మరింత ఎంకరేజ్ చేశారు.
వివరాల్లోకి వెళితే.. వెస్ట్ బెంగాల్లో త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో బీజేపీలోకి ఇతర పార్టీ నేతలు క్యూ కడుతున్నారు. ఈ క్రమంలో గురువారం నాడు మేధినీపూర్ జిల్లాలో బీజేపీ బహిరంగ సభను ఏర్పాటు చేసింది. ఈ క్రమంలో టీఎంసీ పార్టీకి చెందిన మాజీ నాయకుడు సుశాంతా పాల్ బీజేపీ గూటికి చేరుకున్నారు. ఈ క్రమంలో ప్రసంగించిన ఆయన.. టీఎంసీ అధినేత్రిపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. దీదీ ఆధ్వర్యంలో నడుస్తున్న పార్టీలో ఉండి ఇన్నరోజులు తప్పు చేశానని.. అందుకు తనను ప్రజలు క్షమించాలంటూ చెవులు పట్టుకుని బస్కీలు తీశాడు. టీఎంసీలో ఉన్న సమయంలో ప్రజా సమస్యలపై స్పందించే సమయంలో తన గొంతును టీఎంసీ నేతలు నొక్కేశారంటూ ఆరోపించారు. ప్రజల గొంతును వినిపించేందుకు ఇప్పుడు బీజేపీలో చేరానని అన్నారు.
కాగా, సుశాంతాపాల్ను పార్టీ నుంచి ఎప్పుడో సస్పెండ్ చేశామని.. ఇప్పుడు ఆయనకు టీఎంసీలో ఎలాంటి బాధ్యతలు లేవని మేధినీపూర్ జిల్లా టీఎంసీ అధ్యక్షుడు తెలిపారు.