హైదరాబాద్ వెళ్లాలంటే ఎన్ఐఏను ఆశ్రయించాలని వరవరరావుకు సూచించింది సుప్రీం కోర్టు.
భీమా కోరేగావ్ కేసులో నిందితుడిగా ఉన్న ఆయన…కంటి శస్త్రచికిత్స కోసం హైదరాబాద్ కు వెళ్లేందుకు అనుమతి కోరుతూ అత్యున్నత ధర్మాసనాన్ని ఆశ్రయించారు. న్యాయమూర్తులు UU లలిత్, SR భట్ సహా సుధాన్షు ధులియాలతో కూడిన త్రిసభ్య ధర్మాసనం ఆగస్టు 10 నాటి ఉత్తర్వుల ప్రకారం, ట్రయల్ కోర్టు నుంచి ఎక్స్ప్రెస్ అనుమతి లేకుండా గ్రేటర్ ముంబై ప్రాంతాన్ని విడిచిపెట్టరాదని ఆదేశించిన విషయం తెలిసిందే. వరవరరావు తరపు సీనియర్ న్యాయవాది ఆనంద్ గ్రోవర్ వాదనలు వినిపిస్తూ.. పిటిషనర్ వయస్సు 82 ఏళ్లు, కంటి శస్త్రచికిత్స చేయించుకోవాలని అన్నారు. వరవరరావు తెలంగాణకు చెందినవారని.. హైదరాబాద్లో నివాసం ఉంటున్నారని ఆయన తెలిపారు. రావు గతంలో హైదరాబాద్లో నివసిస్తూండేవాడని.. హైదరాబాద్ తన స్వస్థలం కావున ఆయన అక్కడ త్వరగా కోలుకోగలరని.. అందుచేత ఆయన అక్కడ ఆపరేషన్ చేయించుకోవాలని ఆశిస్తున్నట్టు గ్రోవర్ చెప్పాడు. ఎన్ఐఏ తరపు హాజరైన అడిషనల్ సొలిసిటర్ జనరల్ ఎస్వి రాజు ఆయన పిటిషన్ ను వ్యతిరేకిస్తూ.. ఎన్ఐఏ మూడు నెలల సమయం ఇచ్చినా శస్త్రచికిత్సకు వెళ్లలేదన్నారు. ఇరు పక్షాల వాదనలు విన్న ధర్మాసనం ట్రయల్ కోర్టును ఆశ్రయించేందుకు అనుమతించింది. ఈ సందర్భంగా జస్టిస్ లలిత్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆయన ఇక్కడే బాగున్నారని… 50 ఏళ్ల నాటికన్నా ఇప్పుడే యువకుడిలా ఉన్నారని అదనపు సొలిసిటర్ జనరల్ వ్యాఖ్యానించగా..అయితే జైళ్లలో పరిస్థితులు బాగున్నాయని ప్రచారం చేసుకోండని జస్టిస్ చమత్కరించారు.