షాజహాన్ వారసుడని చెప్పుకునే యువరాజు యాకూబ్ హబీబుద్దీన్ టుసీ, బీజేపీ ఎంపీ దియా కుమారికి సవాల్ చేశారు. తాజ్ మహల్ జైపూర్ రాజ్పుత్ర రాజ కుటుంబానికి చెందిన భూమిలో నిర్మించారనీ ఆమె విమర్శించారు. దీనిపై స్పందిస్తూ ప్రిన్స్ యాకుబ్ తన సోషల్ మీడియా ఖాతాలో ఒక వీడియోను షేర్ చేశారు. దియా కుమారిలో నిజంగా రాజ పుత్రుల రక్తం ఉంటే..ఆమె క్లెయిమ్ చేసిన భూమి ఒప్పందాన్ని రుజువు చేసే పత్రాలను ఆమె చూపించాలని అన్నారు.
ఎంపీ దియా కుమారి చేసిన వివాదాస్పద ప్రకటన చూశాను. షాజహాన్ తాజ్మహల్ ఉన్న భూమిని జైపూర్ రాజుల కుటుంబం నుంచి ఎలాంటి పరిహారం చెల్లించకుండా లాక్కున్నారని …దాన్ని నిరూపించే పత్రాలు తన వద్ద ఉన్నాయని ఆమె అన్నారు. అయితే ఆమెకు నేనోమాట చెప్పదలుచుకున్నా. ఆమె నోటికొచ్చింది మాట్లాడారు. కానీ అది మూర్ఖపువాదన.
ముందుగా మీరు చరిత్రను తెలుసుకోండి. ఎందుకంటే షాజహాన్ మీ రాజపుత్రులకు మేనమామ అవుతాడు. అతని రెండో భార్య పేరు లాల్ బాయి. వారి వివాహం 1611 లో ఘనంగా జరిగింది. షాజహాన్ తల్లి జగత్ గోసైన్ కూడా రాజ్పుత్ కుటుంబానికి చెందినవారు. షాజహాన్ అమ్మమ్మ, అంటే జహంగీర్కు జన్మనిచ్చిన అక్బర్ భార్య జోధా బాయి అలియాస్ హర్కా బాయి కూడా రాజ్పుత్ కుటుంబానికి చెందినవారే.
“అక్బర్ రాజ్పుత్లకు అల్లుడు. ఆ రోజుల్లో రాజ్పుత్రులు అల్లుళ్లకు వేర్వేరు ప్యాలెస్లను బహుమతిగా ఇచ్చే ఆచారం ఉంది. కాబట్టి పరిహారం, భూసేకరణ గురించి ఈ వాదన నిరాధారమైనది. మొఘల్లకు ఇది అస్సలు అవసరమే లేదు. ఎందుకంటే మొత్తం హిందూస్తాన్ వారిది. మొఘలులు హిందుస్థాన్ పాలకులు. మీరు జైపూర్ ప్రావిన్స్ గురించి మాట్లాడుతున్నారు. ఆ సమయంలో బంగ్లాదేశ్, పాకిస్తాన్ సహా నేపాల్ సరిహద్దు ప్రాంతాలను కలిగి ఉన్న మొత్తం దేశానికి మొఘలులు పాలకులుగా ఉన్నారు. మొఘల్ సామ్రాజ్యంతో పోలిస్తే మీది చిన్న ప్రావిన్స్ మాత్రమే. మీరు ఆ సమయంలో మొఘలులతో పొత్తు పెట్టుకున్నారు. నా 27 మంది అమ్మమ్మలలో 14 మంది రాజ్పుత్ కుటుంబంలోని వారే. కాబట్టి మీరు డాక్యుమెంట్లు మీ వద్ద ఉన్నాయని ఇలాంటి ప్రకటనలు చేయడం, గాలిలో ఆరోపణలు చేయడం మంచిది కాదు అని యాకూబ్ అన్నాడు.
రాజ్పుత్లు, మొఘల్ల మధ్య జరిగిన భూ ఒప్పందానికి సంబంధించిన పత్రాలు తన రాజకుటుంబం దగ్గర అందుబాటులో ఉన్నాయని, ఆ పత్రాల్లో తక్కువ ఖర్చుతో మొఘలులు లాక్కున్న రాజ్పుత్ల భూమిలో తాజ్మహల్ను నిర్మించారని దియా కుమారి ప్రకటించారు.
అయితే దియాదగ్గర ఎలాంటి పత్రాలు లేవని ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నానని యాకూబ్ అంటున్నారు.మొఘలులు 350 ఏళ్లు పాలించారనే విషయం గుర్తుంచుకోవాలని …రాజ్పుత్లు వారితో సఖ్యతగా ఉన్నారని ..కారణం మన అమ్మమ్మలందరూ రాజ్పుత్ కుటుంబాలకు చెందినవారని అన్నారు. ‘ఇలాంటి చీప్ పబ్లిసిటీ స్టంట్ల ద్వారా కొంత ప్రచారం పొందేందుకు ఇలాంటి ప్రకటనలు చేస్తున్న వారిని పట్టించుకోవద్దని దేశంలోని అన్ని మీడియా సంస్థలకు, హిందువులు సహా ముస్లింలకు నేను విజ్ఞప్తి చేస్తున్నా” అనీ అన్నారు.
Emperor Shah Jahan’s grandson Prince Yakub Habeebuddin Tucy replies the BJP MP Diya Kumari on the claim that Taj Mahal built on the land belongs to Jaipur Royal Family 👇🏻https://t.co/iERvQ9dJHp pic.twitter.com/QlbsMBhXlS
— HrH Prince Yakub Habeebuddin Tucy (@Princeofmoghals) May 12, 2022
ఇక కోర్టులో పిటిషన్ వేసిన బీజేపీ మీడియా సెల్ చీఫ్కి హెచ్చరిక చేశారు యాకూబ్. ఈ రోజు మీరు తాజ్ మహల్ 22 తలుపులు తెరవమని అడుగుతున్నారు. అక్బర్ ఇచ్చిన భూముల్లో నిర్మించిన అమృత్సర్లోని గురుద్వారాలను తవ్వమని రేపు మీరు అడగవచ్చు. ఆ తర్వాత మీరు ముంబైలోని చర్చిలను తెరవమని అడుగుతారు. మీరు ఇలాంటి ప్రకటనలు చేయడం ద్వారా దేశంలోని హిందువులు, ముస్లింల మధ్య వివాదం సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నారు.
“దేశానికి నా సందేశం మోడీ ఇచ్చిన సందేశం లాంటిదే. ఈ కల్లబొల్లి మాటలు ఏ మాత్రం పట్టించుకోకండి. ఆమె మాటలను వెనక్కి తీసుకోమని దియా కుమారిని కూడా నేను కోరాలనుకుంటున్నా. ఆమె అలాంటి చౌకబారు వ్యాఖ్యలు చేయకూడదు.. ముఖ్యంగా మొఘలులు, రాజ్పుత్లు పంచుకున్న మైత్రిని విచ్ఛిన్నం చేయడానికి ప్రయత్నించకూడదు” అని అన్నారు.