కర్నాటకలో పరాజయం చవిచూపిన వేళ బీజేపీని గట్టిగానే హెచ్చరించింది ఆర్ఎస్ఎస్. సంస్థ మౌత్ పీస్ ఆర్గనైజర్లో ఆ పార్టీని హెచ్చరిస్తూ పబ్లిషైన ఆర్టికల్ ఇప్పుడు చర్చనీయాంశమైంది. కర్నాటకలో హిందుత్వం, మోదీ మేనియా పనిచేయలేదని… కాంగ్రెస్ పకడ్బందీ వ్యూహం బీజేపీకి కారణమని పేర్కొంది. ఇప్పటికైనా మేలుకుని పకడ్బందీ వ్యూహాలు, ప్రణాళికలతో వెళ్తేనే 2024 లోక్ సభ ఎన్నికల్లో గెలుపు సాధ్యమవుతుందని వివరించింది. లేకుంటే అంచనాలు తారుమారవడం ఖాయమని హెచ్చరించింది.
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఓటమికి ఆ పార్టీ నేతల అవినీతే ప్రధాన కారణమని.. మొదటిసారి బీజేపీ అవినీతిని సమర్థించుకోవాల్సినపరిస్థితి ఏర్పిడిందనీ ఆర్గనైజర్ అభిప్రాయపడింది. మంత్రులు, ఎమ్మెల్యేలపై ఉన్న వ్యతిరేకత పార్టీ ఓటమికి ముఖ్యకారణమనీ అంది. ఇక కాంగ్రెస్ ప్రజలను ఆకర్షించేందుకు చేసిన కృషి ఫలించిందని… అత్యధిక శాతం ఓటింగ్ నమోదైన ఈ ఎన్నికల్లో ఓట్లను రాబట్టడంలో బీజేపీ పూర్తిగా విఫలమైందనీ అంది. పార్టీ స్థానికనేతల ఐకమత్యం ఆ కుటుంబపార్టీని గెలిపించిందనీ తెలిపింది. లోకల్ లీడర్లతో పాటు… పార్టీ జాతీయ స్థాయి నాయకులు పార్టీ గెలుపుకు పాటుపడ్డారని వివరించింది. అయితే ఎన్నికల్లో ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం ఎలా నెరవేర్చుతుందో.. కాంగ్రెస్ ఎంతకాలం స్థిరమైన పరిపాలన అందిస్తుందో కాలమే నిర్ణయిస్తుందని ఆసక్తికక వ్యాఖ్యలు చేసింది.
కుల సమీకరణ, ఉత్తర, దక్షిణ భారతం అంటూ .. భాషా పునర్వవస్థీకరణ అంటూ ఓట్లను దండుకున్నారని.. ఇది చాలా ప్రమాదకరమని ఆర్గనైజర్ ఆందోళన వ్యక్తం చేసింది.మత రాజకీయం సైతం కీలకంగా మారిందని..మతం బీజేపీ ఓటమికి ప్రధాన కారణమనీ… తమ డిమాండ్లు నెరవేర్చుకునేందుకు కర్ణాటక ముస్లిం నేతలు ఏకమై కాంగ్రెస్కు ఓట్లు వేశారనీ అంది. ముస్లింలు, క్రిస్టియన్లు చేతులు కలిపి హస్తం పార్టీకి సహకరించారని ఆర్గనైజర్ వెల్లడించింది.