‘ఇక్కడ ఉండడం ఇబ్బందైతే నిరభ్యంతరంగా దేశాన్ని వీడండి. మీకు సౌకర్యంగా ఉన్న దేశానికి సంతోషంగా వెళ్లిపొండి’ జమ్ము కశ్మీర్ మాజీ ముఖ్యమంత్రులు ఫరూఖ్ అబ్దుల్లా , మహబూబా ముఫ్తీని ఉద్దేశించి ఆర్ఎస్ఎస్ జాతీయ కార్యవర్గ సభ్యుడు ఇంద్రేశ్ ముఖర్జీ చేసిన వ్యాఖ్యలివి. భారత్ శాంతియుతంగా ఉండడం ఫరూఖ్ అబ్దుల్లాకు ఇష్టం లేదని… ఆయన హింసనే నమ్ముకున్నారనీ మండిపడ్డారు ఇంద్రేష్.
కేంద్రం తీసుకొచ్చిన సాగు చట్టాలకు వ్యతిరేకంగా రైతులు ఎలాగైతే.. ఉద్యమాలు చేశారో, కశ్మీర్ ప్రత్యేక ప్రతిపత్తికి, ప్రత్యేక రాష్ట్ర హోదాకు అలాగే త్యాగాలు చేయాల్సి ఉంటుందని ఫరూక్ అబ్దుల్లా పిలుపునివ్వడంపై ఇంద్రేశ్ అభ్యంతరం వ్యక్తం చేశారు. జమ్మూ కశ్మీర్ ప్రజల హక్కులను కేంద్రం కాలరాస్తోందంటూ…ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ధర్నా నిర్వహించిన మరో మాజీ సీఎం మహబూబా ముఫ్తీ తీరుపైనా ఆయన మండిపడ్డారు. అబద్ధాలు చెప్పడం, దేశ సార్వభౌమత్వాన్ని దెబ్బతీసేలా వ్యవహరించడం అలవాటైందని, వారు తమ తీరు మార్చుకుని దేశ సమైక్యతకు పాటుపడాలని సూచించారు.