జీ తమిళ్ ఛానల్లో ప్రసారమైన రియాలిటీ షో ‘జూనియర్ సూపర్ స్టార్స్ సీజన్ 4’ ఎపిసోడ్పై దాఖలైన ఫిర్యాదుపై స్పందించాలని కోరుతూ జీ ఎంటర్టైన్మెంట్ ఎంటర్ప్రైజెస్కు ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్ కాస్టింగ్ మినిస్ట్రీ నోటీసు జారీ చేసింది. అందులో ప్రధాని నరేంద్ర మోదీని హేళన చేసేలా ఇద్దరు చిన్నారులు స్కిట్ చేస్తున్నట్టు ఉంటుంది. ఏడు రోజుల్లో సమాధానం ఇవ్వాలని మంత్రిత్వ శాఖ ‘జీ’ ని కోరింది.
తమిళనాడులోని ఐటీ, సోషల్ మీడియా సెల్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సీటీఆర్ నిర్మల్ కుమార్ ‘జీ’ పై ఫిర్యాదు చేశారు.
జనవరి 15న చానల్లో “జూనియర్ సూపర్ స్టార్ సీజన్ 4” ప్రోగ్రామ్ ప్రసారమైంది. అది ప్రముఖ తమిళ చారిత్రక రాజకీయ వ్యంగ్య చిత్రం “ఇమ్సై అరసన్ 23 M పులికేసి” చిత్రం ఆధారంగా రూపొందించిన స్కిట్.రాజు, మంత్రి పాత్రల్లో ఇద్దరు చిన్నారులు సింధియా అనే దేశ పాలకుడిని ఎగతాళి చేయడం కనిపించింది. రెండు నిమిషాల నిడివి గల ఆ వీడియో సోషల్మీడియాలోనూ వైరల్ అవుతోంది. నల్లధనాన్ని నిర్మూలించే ప్రయత్నంలో కరెన్సీలను రద్దు చేయడానికి ప్రయత్నించి, ఆ ప్రక్రియలో విఫలమైన రాజు కథను పిల్లలు వివరిస్తున్నారు. ‘రాజు’ నల్లధనాన్ని నిర్మూలించే బదులు రకరకాల రంగుల్లో జాకెట్లు వేసుకుని తిరుగుతుంటాడని ఎగతాళిచేయడం… దేశంలో రాజు తెచ్చిన పెట్టుబడుల ఉపసంహరణ పథకాన్ని, రాజు పాలనను అపహాస్యం చేయడం వంటివి మోదీని ఉద్దేశించేనన్నది స్పష్టమవుతోంది. దీనికి ప్రేక్షకులలో ఉన్న న్యాయమూర్తులు సహా ఇతరులు చప్పట్లు కొట్టడం చూడవచ్చు.
ఇలా షోలో రాజు పాత్రను ఎగతాళి చేయడం ద్వారా 2016 నోట్ల రద్దు చర్యపై ప్రధానిని ఈ షో ద్వారా ‘హేళన’ చేసిందని బీజేపీ ఆరోపించింది. నిర్మల్ కుమార్ జీ ఎంటర్ప్రైజెస్ లిమిటెడ్ చీఫ్ క్లస్టర్ ఆఫీసర్ సిజు ప్రభాకరన్కు లేఖ రాస్తూ, దాదాపు 10 ఏళ్ల వయస్సు ఉన్న పిల్లలతో ఉద్దేశపూర్వకంగానే ప్రధానికి వ్యతిరేకంగా ఈ వ్యాఖ్యలు చేయించారని ఆరోపించారు.
అయితే బీజేపీ అభ్యంతరంపై జీ స్పందించింది. తమ వెబ్సైట్ నుండి సంబంధిత భాగాన్ని తొలగిస్తామని…ఆ షో ను తిరిగి ప్రసారం చేయబోమని జీ హామీ ఇచ్చినట్టు సమాచారం.
https://twitter.com/CTR_Nirmalkumar/status/1482914436067119105?s=20