మొన్న శరద్ పవార్, ఇవాళ నేషనల్ కాన్ఫరెన్స్ చీఫ్ ఫరూఖ్ అబ్దుల్లా. రాష్ట్రపతి ఎన్నికల బరిలో ఉండాలన్న విపక్షాల విన్నపాన్ని తిరస్కరించారు. తాను ఎన్నికల్లో పోటీచేయబోనని జమ్మూ-కశ్మీరుకు సేవ చేయడానికి తాను ఇష్టపడతానని ఆయన ప్రకటించారు. తన పేరును ప్రతిపాదించిన పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, టీఎంసీ అధినేత్రి మమత బెనర్జీకి ధన్యవాదాలు తెలిపారు. రాష్ట్రపతి ఎన్నికల్లో బీజేపీయేతర పక్షాలను ఏకతాటిపైకి తెచ్చేందుకు మమతా బెనర్జీ పావులు కదుపుతున్నారు. అందులోభాగంగా… ఈ నెల 15న న్యూఢిల్లీలోని కాన్స్టిట్యూషన్ క్లబ్లో ప్రతిపక్ష నేతలతో సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి కాంగ్రెస్, టీఎంసీ, డీఎంకే, శివసేన సహా 17 ప్రతిపక్ష పార్టీల నేతలు హాజరయ్యారు. ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ పేరును వీరు ప్రతిపాదించినప్పటికీ, ఆయన సున్నితంగా తిరస్కరించారు. అనంతరం ఫరూఖ్ అబ్దుల్లా పేరును ప్రతిపాదించారు. ఇప్పుడాయనకూడా తిరస్కరించారు.తనను రాష్ట్రపతి పదవికి ప్రతిపక్ష పార్టీల ఉమ్మడి అభ్యర్థిగా ప్రతిపాదించడం పట్ల సంతోషంగా ఉందని…కానీ తాను సొంతరాష్ట్రానికి సేవ చేసేందుకే ఇష్టపడుతానని ప్రకటన విడుదల చేశారు. ప్రస్తుతం అత్యంత క్లిష్టపరిస్థితుల్లో ఉన్న జమ్ముకశ్మీర్ ను అనిశ్చిత పరిస్థితులనుంచి బయటపడేసేందుకు తన అవసరం ఉందని చెప్పారు. భవిష్యత్తులో మరింత క్రియాశీలకంగా పనిచేస్తానన్నారు.