మహారాజకీయ సంక్షోభం ఇంకా ముగియలేదు. రోజుకో మలుపు తిరుగుతోంది. తాజాగా కీలక ప్రకటన చేశారు శివసేన రెబల్ నేత ఏకనాథ్ షిండే. తనకు 50 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉందని ఉదయం ప్రకటన చేసిన ఆయన…తాము శివసేనలోనే ఉన్నామని అందులో ఎలాంటి సందేహం లేదన్నారు. త్వరలో తాను ముంబై వెళ్లి…గవర్నర్ను కలుస్తానని షిండే స్పష్టం చేశారు. రెబల్ ఎమ్మెల్యేల్లో 15 నుంచి 20 మంది ఎమ్మెల్యేలు ఉద్ధవ్ ఠాక్రేతో టచ్లో ఉన్నారన్న సంజయ్ రౌత్ ప్రచారాన్ని షిండే కొట్టిపారేశారు. అటు రెబల్ ఎమ్మెల్యేలు అనర్హత నోటీసులపై స్పందించేందుకు జులై 12 వరకూ సుప్రీం కోర్టు గడువు పొడిగించిన సంగతి తెలిసిందే. అప్పటి వరకూ రెబల్ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు పడే అవకాశం లేదు.
దీంతో షిండే తన తదుపరి వ్యూహాలకు పదును పెట్టారు. గవర్నర్ను కలిసి అవిశ్వాస తీర్మాన ప్రతిపాదనను ఆయన ముందు పెట్టాలనే ఆలోచనలో ఏక్నాథ్ షిండే ఉన్నట్లు తెలిసింది. ఎమ్మెల్యేలు ముంబై తిరిగిరావాలని…అంతా కలిసి మాట్లాడుకుని సమస్యను పరిష్కరించుకుందామని ఉద్దవ్ మరోసారి విజ్ఞప్తి చేశారు. మరోవైపు బీజేపీ కూడా చకచకా పావులు కదుపుతోంది. దేవేంద్ర ఫడణవీస్ ఇవాళ ఢిల్లీ వెళ్లారు. రాష్ట్ర రాజకీయాలపై కేంద్ర నాయకులతో చర్చలు జరపనున్నారు.
షిండే ముంబై వెళ్లినా..రెబల్ ఎమ్మెల్యేలు అసోంలోని గువాహతిలోని రాడిసన్ బ్లూ హోటల్లో ఎక్కువ రోజులు ఉండే అవకాశం ఉందని.. హోటల్ ను జూలై 5 వరకు బుక్ చేశారని.. ఇప్పుడు అవసరాన్ని బట్టి బుకింగ్ను పొడిగించవచ్చు అని సమాచారం. హోటల్ జూన్ 30 వరకు అన్ని కొత్త బుకింగ్లను నిలిపివేసినట్లు తెలిసింది.