కేరళ ప్రభుత్వ తీరుపై మండిపడ్డారు గవర్నర్ ఆరిఫ్ మహ్మద్ ఖాన్. తన అధికారాలను తగ్గిస్తూ ప్రభుత్వం రూపొందించిన ఆర్డినెన్స్ పై సంతకం చేయలేనని స్పష్టంచేశారు. దానిపై తనకు తాను తీర్పు చెప్పుకోలేనని… రాష్ట్రపతికి పంపిస్తాననీ ఆయన అన్నారు. విశ్వవిద్యాలయాల చాన్స్లర్గా గవర్నర్ను తొలగించి ప్రముఖ విద్యావేత్తలను నియమించాలని ప్రతిపాదిస్తూ కేరళ రాష్ట్ర ప్రభుత్వం ఆర్డినెన్స్ రూపొందించిన సంగతి తెలిసిందే. గవర్నర్ సంతకం చేస్తే ఆర్డినెన్స్ అమల్లోకి వస్తుంది. దీంతో సంతకం కోసం దాన్ని రాజ్ భవన్ కు పంపింది ప్రభుత్వం. అయితే ఈ వ్యవహారంపై స్పందించిన ఆరిఫ్ మహ్మద్ ఖాన్ రాష్ట్ర ప్రభుత్వం తనను లక్ష్యంగా చేసుకొందన్నారు. తనపై తాను తీర్పు ఇచ్చుకోలేనన్నారు.అయితే రాష్ట్ర కేబినెట్ తీసుకున్న ఏ నిర్ణయాన్ని అయినా గవర్నర్ ఆమోదించాలని….అది రాజ్యాంగ నిబంధన అని అధికార పార్టీ నేతలు అంటున్నారు. విశ్వవిద్యాలయాల చాన్సలర్లుగా గవర్నర్ లను తొలగించాలన్న కేరళ సర్కారు నిర్ణయం పై బీజేపీతో పాటు కాంగ్రెస్ సైతం తప్పుబట్టాయి. విశ్వవిద్యాలయాను కమ్యూనిస్టు కేంద్రాలుగా మార్చే కుట్ర జరుగుతోందని మండిపడుతున్నాయి.