తన అత్తమామలు నారాయణమూర్తి, సుధామూర్తిని చూసి గర్వపడుతున్నానన్నారు బ్రిటన్ ప్రధాని రేసులో ముందున్న రిషి సునక్. భార్య అక్షితపై వచ్చిన ఆరోపణలపైనా ఆయన స్పందించారు. ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్య్వూలో మాట్లాడుతూ… తన భార్య ఆస్తులపై విమర్శలుసరికావన్నారు. అక్షత రూ.20 కోట్ల పన్ను ఎగవేసే అవకాశం ఉన్నా నిజాయితీగా చెల్లించిందని ఆయన తెలిపారు. భారత్, బ్రిటన్లో ఇన్ఫోసిస్ షేర్ల ద్వారా వచ్చిన ఆదాయంపై పన్ను చెల్లించేందుకు తన భార్యకు చట్టబద్ధంగా వచ్చిన నివాసేతర స్థితిని రద్దు చేసుకున్న విషయాన్ని ప్రస్తావించారు.
“నా భార్య కుటుంబ సంపద గురించి మాట్లాడుతున్నారు. కానీ నా అత్తమామలు సాధించిన విజయాల పట్ల నేను నిజంగా గర్వపడుతున్నాను. “మా మామగారు ఏమీ లేకుండా వచ్చారు, కేవలం తన బలమైన కోరిక నుంచి ఇదంతా వచ్చింది. ఆయన ప్రపంచంలోనే అతిపెద్ద, అత్యంత గౌరవనీయమైన కంపెనీని నిర్మించారు, యునైటెడ్ కింగ్డమ్లో వేలాది మందికి ఉపాధి కల్పించే అత్యంత విజయవంతమైన కంపెనీలలో ఇదీ ఒకటి” అని ఆయన చెప్పారు.
సునక్ తన US గ్రీన్ కార్డ్ స్టేటస్ గురించి కూడా వివరణ ఇచ్చారు. తాను బ్రిటన్లో ప్రజాప్రతినిధిగా ఎన్నికైన తర్వాత అమెరికా గ్రీన్ కార్డును వదులుకున్నట్టు చెప్పారు.